MS Dhoni : ‘కెప్టెన్’ కూల్‌కు ఇది చివరిదేనా? మరి ఈసారి చెన్నైను ఎలా నడిపిస్తాడో..?

 రెండేళ్లపాటు నిషేధం.. గత సీజన్‌ ఛాంపియన్‌.. అత్యధికసార్లు ఫైనల్‌కు...

Updated : 26 Mar 2022 14:25 IST

రెండేళ్లపాటు నిషేధం.. నాలుగుసార్లు ఛాంపియన్‌.. దేశవాళీ లీగ్‌ చరిత్రలోనే అత్యధికసార్లు ఫైనల్‌కు దూసుకెళ్లిన జట్టు చెన్నై.. కెప్టెన్‌ ఎంఎస్ ధోనీతోపాటు ఇద్దరు ఆల్‌రౌండర్లు, ఒక స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ను రిటెయిన్‌ చేసుకుంది. మరి మెగా వేలంలో ఎలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసుకుంది.. ఈసారి కెప్టెన్‌ కూల్‌ జట్టు కూర్పును ఎలా చేయబోతున్నాడు, సారథిగా ధోనీకి ఇదే చివరి ఐపీఎల్‌గా విశ్లేషకులు భావిస్తోన్న తరుణంలో జట్టు బలాలు, బలహీనతలను ఓసారి అంచనా వేద్దాం.. 

ఎంఎస్‌ ధోనీ నాయకత్వంలో టీమ్‌ఇండియా అపూర్వమైన విజయాలను సాధించింది. అలానే తొలి ఎడిషన్‌ నుంచి చెన్నై నడిపిస్తోన్న ఏకైక సారథి ఎంఎస్ ధోనీ.. బ్యాటర్‌గా ఫామ్‌లో లేకపోయినా కెప్టెన్సీ మాత్రం అదరగొట్టేస్తున్నాడు. నాలుగుసార్లు చెన్నైను ఛాంపియన్‌గా నిలిపాడు. ఈసారి మెగా వేలానికి ముందు ధోనీతోపాటు భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్‌కు చెందిన మొయిన్‌ అలీ, రుతురాజ్‌ గైక్వాడ్‌ను చెన్నై రిటెయిన్‌ చేసుకుంది. వేలంలో రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, హరి నిషాంత్‌, జగదీశన్‌, కేఎం అసిఫ్, తుషార్‌ దేశ్‌పాండే, శివమ్ దూబె, క్రిస్‌ జొర్డాన్‌, మహీశ్ తీక్షణ, ప్రిటోరియస్, డేవన్ కాన్వే, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, సేనాపతి, ముకేశ్‌ చౌదరి, ప్రశాంత్ సోలంకీ, భగత్‌వర్మను సొంతం చేసుకుంది.

ప్రధాన బ్యాటర్లు వీరే.. ఆల్‌రౌండర్లే అధికం

గతేడాది డుప్లెసిస్‌-రుతురాజ్ జోడీ చెలరేగి ఆడటంతో కప్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడు రుతురాజ్‌కు తోడుగా ఉతప్పను పంపొచ్చు. గత సీజన్‌ ఆఖర్లో ఉతప్ప ఫర్వాలేదనిపించాడు. ఆరంభ ఓవర్లలో స్ట్రోక్‌ప్లేతో బౌండరీలను అలవోకగా బాదుతాడు. ఇక మిడిలార్డర్‌లో అంబటి రాయుడు, శివమ్‌ దూబె, ప్రిటోరియస్‌, ఎంఎస్ ధోనీ, డ్వేన్‌ బ్రావో, క్రిస్‌ జొర్డాన్‌, దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్‌... లోయర్‌ ఆర్డర్‌ వరకు ఆదుకోగల ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఓపెనింగ్‌ భాగస్వామ్యం పటిష్ఠంగా ఉంటేనే తర్వాత వచ్చే బ్యాటర్లు అలవోకగా పరుగులు రాబట్టగలరు. లేకపోతే ఒత్తిడికి చిత్తయ్యే అవకాశం ఉంది. మొత్తం 25 మంది సభ్యుల్లో 9 మంది ఆల్‌రౌండర్లు ఉండటం విశేషం. 

దీపక్‌ చాహర్‌ నేతృత్వంలో... 

గత సీజన్‌లో దీపక్ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, హేజిల్‌వుడ్, సామ్‌ కరన్‌, డ్వేన్ బ్రావో వంటి పేస్‌ బౌలర్లు ఉండేవారు. ఇప్పుడు  దీపక్‌ చాహర్‌, డ్వేన్‌ బ్రావో మాత్రమే పాతవారు కాగా.. యువ ఆటగాళ్లు కేఎం అసిఫ్, తుషార్‌ దేశ్‌పాండే, క్రిస్‌ జొర్డాన్‌, రాజ్‌వర్థన్‌, సిమన్‌జీత్‌ సింగ్, ఆడమ్‌ మిల్నే, ముకేశ్‌ చౌదరి ఉన్నారు. అయితే వీరిలో తుది జట్టులో ముగ్గురికి మాత్రమే అవకాశం దక్కుతుంది. ఇక స్పిన్‌ విభాగం పటిష్ఠంగానే ఉంది. రవీంద్ర జడేజా, మొయిన్‌ అలీ, మిచెల్ సాంట్నర్‌ రూపంలో బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌ చేయగలరు. కొత్తవారికి దాదాపు ఛాన్స్‌ రాకపోవచ్చు. అయితే ధోనీ ప్రయోగాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

కూర్పే కీలకం..  ధోనీ ఏం మాయ చేస్తాడో..?

 ఛాంపియన్‌గా నిలిచిన గత సీజన్‌నే తీసుకుంటే ఓపెనర్లు శుభారంభం అందించేవారు. వారిద్దరిలో ఎవరో ఒకరు భారీ స్కోరు సాధించేవారు. ఒకవేళ ఓపెనర్లు విఫలమైతే అంబటి రాయుడు, మొయిన్‌ అలీ, రైనా, జడేజా, ధోనీ, బ్రావో, సామ్‌ కరన్‌ తలో చేయి వేసేవారు. ఇక ఆఖర్లో అవసరమైనప్పుడు దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ బ్యాట్‌ను ఝలిపించారు. అందుకే ఈసారి కూడానూ కప్‌ను చేజిక్కించుకోవాలని భావిస్తే మాత్రం అన్ని విభాగాల్లో జట్టును సెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని