Virat Kohli: 2008లో ఆర్సీబీ తీసుకున్న ధరకు ఆశ్చర్యపోయా: కోహ్లీ

ఐపీఎల్‌ భారత క్రికెట్‌కే తలమానికం. ఈ మెగా ఈవెంట్‌తో దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ మరోస్థాయికి చేరింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రతిభావంతులు...

Published : 01 Feb 2022 14:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ భారత క్రికెట్‌కే తలమానికం. ఈ మెగా ఈవెంట్‌తో దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ మరోస్థాయికి చేరింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రతిభావంతులు.. తమనుతాము నిరూపించుకొనేందుకు సరైన వేదికగా మారింది. ఇక్కడ అవకాశం వచ్చి ఒక్కసారి క్లిక్‌ అయితే ఆటగాళ్ల దశ-దిశ మారిపోతుంది. దీంతో ప్రతి ఒక్కరూ ఈ మెగా ఈవెంట్‌లో ఆడాలనుకుంటారు. ప్రస్తుతం టీమ్‌ఇండియాలో స్టార్లుగా కొనసాగుతున్న చాలా మంది ఆటగాళ్లు సైతం ఈ మెగా ఈవెంట్‌ నుంచే వెలుగులోకి వచ్చారు. అందులో బ్యాటింగ్‌ గ్రేట్‌, మాజీ సారథి విరాట్‌ కోహ్లీ సైతం ఉన్నాడు. అతడు తొలిసారి 2008లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఎంపికైనప్పుడు తనని కొనుగోలు చేసిన ధర చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు.

తాజాగా ఆర్సీబీ జట్టు తమ క్రికెటర్లతో ఓ ఆసక్తికరమైన వీడియోను అభిమానులతో పంచుకుంది. అందులో ఐపీఎల్‌ తమ కెరీర్‌లను ఎలా మార్చిందని విరాట్‌ కోహ్లీ,  ఏబీ డివిలియర్స్, మహ్మద్‌ సిరాజ్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌లను అడిగింది. ఈ క్రమంలోనే కోహ్లీ మాట్లాడుతూ తన ఐపీఎల్‌ ఎంట్రీపై ఇలా చెప్పుకొచ్చాడు. ‘2008లో ఐపీఎల్‌ వేలం జరిగేటప్పుడు మేమంతా అండర్‌-19 ప్రపంచకప్‌ కోసం మలేసియాలో ఉన్నాం. ఆ రోజు నాకింకా గుర్తుంది. అప్పుడు మమ్మల్ని ఎంత ధరకు తీసుకోవాలని నిర్ణయించారో తెలిసి ఆశ్చర్యపోయాం. ఎందుకంటే అది చాలా పెద్ద మొత్తం. అయితే, నన్ను దిల్లీ టీమ్‌ తీసుకోవాలని చూసినా వాళ్ల పరిస్థితులకు పేస్‌ బౌలర్‌ను తీసుకోవాలనుకున్నారు. దాంతో అప్పుడు మా అండర్‌-19లోని అత్యుత్తమ బౌలర్‌ ప్రదీప్‌ సాంగ్వాన్‌ను తీసుకున్నారు. నేనేమో ఆర్సీబీకి వెళ్లాను’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

‘బెంగళూరు టీమ్‌ నన్ను తీసుకోవడం నా జీవితంలోనే ప్రత్యేకమైన సందర్భం. దాంతో ఈ స్థాయికి చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు తిరిగి వెనక్కి చూసుకుంటే నాటి పరిస్థితులు మరోలా ఉన్నాయనిపిస్తోంది. అలాగే నన్ను నేను ఆర్సీబీలో తప్ప మరే జట్టులోనూ చూడాలనుకోవడం లేదు. నాకు మాటల ఊరట కన్నా నిజాయితీగా ఉండటమే ముఖ్యం. నేను ఐపీఎల్‌ ఆడే చివరి రోజు వరకూ ఈ జట్టులోనే కొనసాగుతా’ అని మాజీ సారథి వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని