MS Dhoni: ధోనీని మెంటార్‌గా ఎందుకు తీసుకున్నారు... అంత స్పెషలేంటి?

వికెట్‌ కీపర్‌గా, కెప్టెన్‌గా ధోనీ ఏం చేశాడు, ఎందుకు మెంటార్‌ అయ్యాడు... 

Published : 24 Oct 2021 01:19 IST

మాస్టర్‌ మైండ్‌... ఆధునిక క్రికెట్‌ అందులోనూ ఇండియన్‌ క్రికెట్‌లో ఈ పేరు సెట్‌ అయ్యే ఏకైక క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ. టీమిండియా కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌గా ధోనీ వేసిన ప్రణాళికలు, ఆచరణలో పెట్టిన విధానం, కుర్రాళ్లను నడిపిన తత్వం చూస్తే ఎవరన్నా ఈ మాటే అంటారు. మొన్నటి వరకు మహేంద్ర సింగ్‌ ధోనీ.. ఇప్పుడు టీమిండియాకు మెంటార్‌ ధోనీ అయ్యాడు. ఈ నేపథ్యంలో ధోనీ ఎందుకు ‘మెంటార్‌’, అతని ప్రత్యేకతలు ఏంటో ఓసారి చూద్దాం!

అది 2007... 

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య వన్డే మ్యాచ్‌ జరుగుతోంది. 39వ ఓవర్‌లో సచిన్‌ తెందూల్కర్‌ బౌలింగ్‌కి వచ్చాడు. అప్పటికే  షాహిద్‌ అఫ్రిది జోరుమీదున్నాడు. వికెట్ల వెనుక ఉన్నది కుర్ర ధోనీ. అఫ్రిది ఆటను గమనించి మహీ... ఓవర్‌ మూడో బంతి వేస్తుండగా సచిన్‌కు సైగ చేశాడు. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా బంతి వేయమని దాని అర్థం. బంతిని, ధోనీ బుర్రను అర్థం చేసుకోని అఫ్రిది వికెట్లు వదిలి ముందుకొచ్చాడు. అంతే ధోనీ బంతిని ఇలా అందుకొని.. అలా వికెట్లు గిరటేశాడు. ధోనీ మాస్టర్‌ మైండ్‌ ఏంటో అప్పుడే క్రికెట్‌ ప్రేక్షకులకు కనిపించింది. 

ఇక 2021...

ఆ మ్యాజిక్‌ బ్రెయిన్‌ టీమిండియా నుంచి రిటైర్‌ అయ్యింది. అయితే ఈ ఏడాది ఎలాగైనా టీ20 ప్రపంచకప్‌ గెలవాలని బీసీసీఐ ధోనీని మెంటార్‌గా తీసుకొచ్చింది. తొలి మ్యాచ్‌  టీమిండియాకే కాదు.. మెంటార్‌ ధోనీకీ అగ్నిపరీక్షే. మొత్తం ప్రపంచకప్‌ ఫలితం ఒకెత్తు అయితే పాకిస్థాన్‌తో మ్యాచ్‌ మరో ఎత్తు. అంతలా అంచనాలు ఉంటాయి ఈ మ్యాచ్‌ విషయంలో. అందులోనూ మెంటార్‌గా ధోనీకి ఇది తొలి మ్యాచ్‌. జట్టుతోపాటు మైదానంలో ఉండి ఆడించడం ఒకెత్తు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉండి ప్రణాళికలు రచించడం, వాటిని కెప్టెన్‌ అమలు చేసేలా చూసుకోవడం మరో ఎత్తు. ఇప్పుడు ధోనీ అదే చేయబోతున్నాడు.

టీ20 ప్రపంచకప్‌ తొలి విజేత భారత్. అప్పుడు జట్టును ముందుండి నడిపించింది మహేంద్రుడే. ఆ తర్వాత ఐదు టీ20 ప్రపంచకప్‌లు జరిగాయి. అందులో ఒక్కసారే భారత్‌ ఫైనల్‌కు వెళ్లింది. దీంతో ఈసారి కప్‌ పక్కాగా కొట్టాలని టీమిండియా ఫిక్స్‌ అయ్యింది. అందుకోసం టీమ్‌ని సిద్ధం చేసుకుంటూ వచ్చింది. ఈ కీలక టోర్నీకి ధోనీ లాంటి మ్యాజిక్‌ బుర్ర కూడా ఉంటే బాగుంటుందని భావించి మెంటార్‌గా తీసుకున్నారు. ఎందుకంటే కుర్రాళ్లను సానపట్టడంలో, పనితనం రాబట్టడంలో ధోనీ దిట్ట. మ్యాచ్‌ను గెలిపించే ప్రణాళికలు మూడు సెట్లు ధోనీ దగ్గర ఉంటాయి అంటుంటారు అతని సహచరులు. టీమిండియాలో, చెన్నై సూపర్‌కింగ్స్‌లో ధోనీ చేసిందిదే.

భజ్జీని కాదని...

మిస్టర్‌ కూల్‌ అని ధోనీని పిలుస్తుంటారు అంతా. మైదానంలో ఎంతటి భావోద్వేగాలు వచ్చినా.. ముఖంలో కనిపించకుండా తను వేసుకున్న ప్రణాళికలను ఆచరణలో పెడుతుంటాడు. దానికి తగ్గ ఫలితాలను సాధిస్తుంటాడు. వికెట్ల వెనుక ఉండి బంతిని, మైదానాన్ని, బ్యాట్స్‌మన్‌ను ఎలా చదువుతాడో.. బౌలర్లనూ అంతగానే చదివేసుంటాడు. ఎవరిని ఎప్పుడు బౌలింగ్‌కి తీసుకురావాలన్నది ధోనీకి బాగా తెలుసు. ఎలా బౌలింగ్‌ చేయాలో సూచించడమూ తెలుసు. ప్రత్యర్థి జట్టును ఆత్మరక్షణలో పడేసే బౌలింగ్‌ మార్పులు ధోనీ నుంచి చూడొచ్చు. దీనికి ఒక ఉదాహరణ 2007 ప్రపంచకప్‌లో ఆఖరి ఓవర్‌ బౌలింగ్ సీనియర్‌ అయిన హర్భజన్‌ సింగ్‌ని కాదని, కొత్త పేసర్‌ జోగీందర్‌ శర్మకు ఇవ్వడం. అందుకు తగ్గట్టే జోగీ.. మిస్బాహుల్‌ హక్‌ వికెట్‌ తీసి మ్యాచ్‌ గెలిపించాడు. 

బ్యాటర్‌ మారితే... 

క్రీజులో బ్యాటర్‌ మారితే... ధోనీ మైండ్‌లో స్క్రీన్‌ మారిపోతుంది అంటుంటారు. కొత్త బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టగల బౌలర్‌ ఎవరా అనే విషయం... ఆ ఆటగాడు క్రీజులోకి వచ్చి గార్డ్‌ తీసుకునేలోపే ఊహించేస్తుంటాడు. అందుకే ఎడమచేతి వాటం బ్యాటర్లు రాగానే ఆఫ్‌స్పిన్నర్‌ను రంగంలోకి దించుతాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇలా చేసే 200కు పైగా లెఫ్ట్‌ హ్యాండర్ల వికెట్లు తీసుకున్నాడు. 2015 ప్రపంచకప్‌లో జోరుమీదున్న మ్యాక్స్‌వెల్‌ను బోల్తా కొట్టించడానికి ధోనీ... అశ్విన్‌ను దించాడు. దానికి కారణం మ్యాక్సీని ఔట్‌చేయడంలో అశ్విన్‌కు ఉన్న రికార్డు. జడేజా లాంటి బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌... అసలు సిసలు ఆల్‌రౌండర్‌గా మారడంలో ధోనీ పాత్ర కీలకం. 

బోల్తా కొట్టించేలా... 

యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ లాంటి రిస్ట్‌ స్పిన్నర్లను ఎలా ఎప్పుడు వాడాలో ధోనీకి బాగా తెలుసు. దీనికి ఉదాహరణ... ధోనీ జట్టు నుంచి తప్పుకున్నాక కుల్‌దీప్‌, చాహల్‌ పూర్వపు జోరు చూపించలేకపోతుండటమే. వికెట్ల వెనుక నుంచి ధోనీ ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌, సపోర్టును చాహల్‌, కుల్‌దీప్‌ బాగా మిస్‌ అవుతున్నారని క్రికెట్‌ నిపుణులు చెబుతుంటారు. బంతి వేగం తగ్గించి బోల్తా కొట్టించడం టీ20ల్లో ఎక్కువగా చూస్తుంటాం. అలా ఎప్పుడు తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పే బుర్ర ధోనీది. 2012 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఇర్ఫాన్‌ పఠాన్‌ వేసిన ఓ డెలివరీ అందుకు ఉదాహరణ. జోరు మీదున్న ఇంగ్లిష్‌ బ్యాటర్‌ స్లో బంతితో బోల్తా కొట్టించాడు పఠాన్‌. 2016 టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీని బౌలింగ్‌కి దింపి వికెట్‌ సాధించడమూ ఇలాంటిదే.

వికెట్లను చూడకుండా... 

క్రికెటరా... ఫుట్‌బాల్‌ గోల్‌ కీపరా? ఓ మ్యాచ్‌లో ధోనీ కీపింగ్‌ స్టైల్‌ను చూసి కామెంటేటర్లు అన్నమాటలివి. గోల్‌ కీపర్‌లాగా కాళ్లు చాపి మరీ బంతిని ఆపితే ఇలా కాక ఇంకేమంటారు. బంతిని బ్యాట్స్‌మన్‌ ఆఖరి వరకు వేచి చూసి...  స్లిప్‌, కీపర్‌ మధ్యలో కొడదామని చూస్తే.... అంతకంటే ముందే బ్యాట్‌ యాంగిల్‌ చూసి కాళ్లు చాపి బంతిని ఆపేసే బుర్ర అది. ధోనీని బెస్ట్‌ కీపర్‌ అనడానికి ఇదొక్క విషయమే చాలదు అనుకుంటే.. ఇంకా చాలా ఉన్నాయి. వికెట్లను చూడకుండా బంతిని కాళ్ల కింద నుంచి వికెట్ల మీదకు కొట్టడం, గ్లోవ్‌ యాంగిల్‌ చేసి దూరంగా వస్తున్న బంతి వికెట్ల మీదకు మళ్లేలా చేయడం.. ఇలా ఎన్నో ఎన్నెన్నో. ఇందులో కీపింగ్‌ టాలెంట్‌ ఎంత ఉందో, ఆలోచన కూడా అంతే కనిపిస్తుంది. 

మాటలాపు.. ఆట ఆడు...

క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ను ఎదుర్కోవాలంటే తిరిగి మాటలు అనక్కర్లేదు. అవతలి జట్టు మీద ఒత్తిడి పెంచితే చాలు.. ఇదీ ధోనీ ఆలోచన. దీనినే కెరీర్‌ అంతా చేసుకుంటూ వచ్చాడు ధోనీ. దీనినే మైండ్‌ గేమ్‌ అంటుంటాడు. తనే కాదు, తన టీమ్‌ మేట్స్‌కు కూడా ఇదే మాట చెబుతుంటాడు. ఓసారి పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో సురేశ్‌ రైనాతో ఉమర్‌ అక్మల్‌ మాటల యుద్ధం లేపాడు. ఇదే విషయం ధోనీ దగ్గర రైనా చెబితే.. మాటలు కాదు.. ఆట ఆడి వాళ్ల మీద ఒత్తిడి పెంచు అని చెప్పాడట. అందుకే ఈ మైండ్‌ను ఇప్పుడు మెంటార్‌ చేసింది. 

నమ్మకం ఉంచి...

యువ క్రికెటర్ల విషయంలో ధోనీ ఆలోచన సూపర్‌ అంటుంటారు క్రీడా పండితులు. ఓ యువ క్రీడాకారుడిలో స్పార్క్‌ కనిపిస్తే... అతడిని బాగా నమ్మేస్తాడు. వాళ్లు కూడా అదే స్థాయిలో రాణించి కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతుంటారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు బౌలర్లను తీసుకోండి.. శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌ ఇద్దరూ కుర్రాళ్లే. రుతురాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలా. ఈ ఏడాది ఐపీఎల్‌ ఆరెంజ్‌ క్యాప్‌ గెలిచాడు మరి. వీళ్లే కాదు టీమిండియాలో ఇప్పుడు స్టార్‌ ఆటగాళ్లుగా ఉన్న ఎంతో మంది ఒకప్పుడు ధోనీ కెప్టెన్సీలో రాటుదేలిన కుర్రాళ్లే. 

ప్లాన్‌ ‘సి’ కూడా... 

అదేదో సినిమాలో హీరో దగ్గర ప్లాన్‌ బి ఉంటుంది. అయితే ధోనీ దగ్గర ప్లాన్‌ ‘సి’ కూడా ఉంటుంది. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, కీపింగ్‌, కెప్టెన్సీ ఇలా అన్ని విభాగాల్లో మూడు ప్లాన్స్‌ ముందుగానే సిద్ధం చేసుకుంటాడు. ఒకటి వర్కౌట్‌ అవ్వదు అనిపిస్తే... రెండోది ఆటోమేటిక్‌గా మైండ్‌లో లోడ్‌ అయిపోతుందట. దానికి తగ్గట్టు ఆటను మార్చి ప్రత్యర్థి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంటాడు. ధోనీ చెస్‌ ఆటగాడు కావడం వల్ల ఇలాంటి టాలెంట్‌ అబ్బింది అంటుంటాడు ధోనీ ప్రియ సహచరుడు సురేశ్‌ రైనా. క్రికెట్‌ మైదానంలో ధోనీ ప్రత్యర్థుల మైండ్‌తో ఆడుతుంటాడని అంటాడు రైనా. 

ముందు ఎందుకొచ్చాడు...  

ఎప్పుడు ఎవరు బ్యాటింగ్‌కి రావాలి అనేది నిర్ణయించడం అంత ఈజీ కాదు. సరైన సమయంలో, సరైన బ్యాటర్‌ గ్రౌండ్‌లోకి దిగపోతే మ్యాచ్‌ను కోల్పోయే పరిస్థితి వస్తుంది. ధోనీ ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివాడు అనొచ్చు. దీనికి ఉదాహరణ 2007 టీ20 ప్రపంచకప్‌. ఫైనల్‌లో యువరాజ్‌ కంటే ముందు ఆర్డర్‌లోకి వచ్చి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్‌గా ఆ స్టెప్‌ తీసుకోవడం సులభమే, కానీ దాని వెనుక అతడి మైండ్‌లో ఎన్ని లెక్కలు వేసుంటాడో ఆలోచించొచ్చు. మొన్నీమధ్య ముగిసిన ఐపీఎల్‌లో కూడా ఇలా ఆలోచించే మొయిన్‌ అలీని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపి మంచి ఫలితం రాబట్టాడు. 

పరుగుల దొంగ... 

ఒకే బంతికి రెండు ఔట్లు చేయాలి ఎంత టాలెంట్‌ ఉండాలి. అన్నింటికీ మించి మైదానంలో ఎంత అలర్ట్‌గా ఉండాలి. ధోనీ విషయంలో ఇలాంటివి చాలా సందర్భాలు ఉంటాయి. బ్యాట్‌ అండ్‌ ప్యాడ్‌ అనిపించే క్యాచ్‌ పట్టి అప్పీలు చేస్తూ.. అదెక్కడ ఔట్‌ కాదేమో అని స్టంప్‌ ఔట్‌ కూడా చేస్తాడు ధోనీ. ఇక బ్యాటింగ్‌లోనూ ఇలాంటివి ధోనీ ఎన్నో చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ధోనీ భారీ షాట్‌ కొట్టి బౌండరీ దగ్గర క్యాచ్‌ ఔటయ్యాడు. ఈ క్రమంలో బంతిని ఫీల్డర్‌ పట్టే లోపు... నాన్‌ స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్‌ తనను క్రాస్‌ చేసేలా చూసుకుంటాడు. అప్పుడు తర్వాతి బంతిని కొత్త బ్యాటర్‌.. క్రీజులోకి రాకూడదనేది ధోనీ మైండ్‌ ప్లాన్‌. ఇవి పక్కన పెడితే పరుగులు దొంగిలించడంలో ధోనీ దిట్ట. ప్రత్యర్థి ఆటగాళ్లు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఒకటికి, రెండు పరుగులు లాగేస్తాడు. ఫీల్డర్ల బద్ధకాన్ని, గురితప్పే త్రోలను ముందే పసిగట్టి అదనపు పరుగు తీసేలా పార్టనర్‌ను ప్రోత్సహిస్తాడు. 

క్రీడాస్ఫూర్తి

ఆటలోనే కాదు.. మంచి మనసులోను, క్రీడా స్ఫూరిని పెంపొందిండచంలోనూ ధోనీ ఎప్పుడూ ముందే ఉంటాడు. 2011లో ఇందుకుగాను ధోనీకి ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ పురస్కారం కూడా ఇచ్చింది. పదేళ్లకోసారి ఇచ్చే పురస్కారం ఇది. ట్రెంట్‌ బ్రిడ్జిలో జరిగిన టెస్టులో ఇది జరిగింది. షాట్‌ కొట్టిన బంతి బౌండరీ లైన్‌కు తాకింది అనుకొని ఇయాన్‌ బెల్‌ అవతలి క్రీజులో బ్యాట్‌ పెట్టకుండా ఉండిపోయాడు. ఇంతలో బంతిని అందుకున్న ప్రవీణ్‌ కుమార్‌ బంతిని ధోనీకి ఇచ్చాడు. దీంతో ధోనీ... బెల్‌ను రనౌట్‌ చేశాడు. అయితే కాసేపటికే విషయం తెలుసుకొని బెల్‌ను వెనక్కి రప్పించాడు. 

గ్లోవ్‌ తీసి.. పరుగుపెట్టి

ధోనీ సమయస్ఫూర్తి గురించి చర్చించకుండా... ఈ స్టోరీ ముగిస్తే అసంపూర్ణమే అని చెప్పొచ్చు. దీని గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది 2016 టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌. అందులో బంగ్లా పులులు గెలవాలంటే ఆఖరి బంతికి రెండు పరుగులు తీయాలి. ఎక్కడ ఒక పరుగు తీసి డ్రా చేసుకుంటారేమో అని ధోనీ ఊహించేశాడు. ధోనీ ఫీల్డ్‌ సెట్‌ చేసి, బంతి ఎలా వేయాలో హార్దిక్‌ పాండ్యకు సూచించి ఓ గ్లోవ్‌ తీసేశాడు. ఎందుకా అని చూస్తున్నవాళ్లు ఆశ్చర్యపోతున్నారు. ఈలోగా పాండ్య ఆఫ్‌ స్టంప్‌కు దూరంగా బంతి వేశాడు. బంతి కీపర్‌ను చేరుకునేలోగా బంగ్లా బ్యాటర్‌ పరుగు అందుకున్నారు. ఇదే సమయంలో మామూలు కీపర్‌ అయితే... బంతిని వికెట్ల మీదకు విసరుతాడు. కానీ అక్కడ ఉన్నది ధోనీ. బంతిని పట్టుకుని వికెట్ల వద్దకు వాయు వేగంతో పరిగెత్తుకొచ్చి వికెట్లు గిరటేశాడు. ఇంకేముంది మ్యాచ్‌ బంగ్లా పులల చేతుల్లోంచి... భారత సింహాల చేతుల్లోకి వచ్చేసింది. ధోనీ సమయస్ఫూర్తికి, స్పాట్‌ స్ట్రాటజీల సత్తాకి ఇంతకుమించిన ఉదాహరణ ఇంకొకటి ఉండదు.

అందుకే ఆ నిర్ణయం... 

ధోనీ.. ఇంత మాస్టర్‌ మైండ్‌ కాబట్టే.. దేశానికి కెప్టెన్‌గా ఆరేళ్లలో మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. టీ20 ప్రపంచకప్‌ (2007), వన్డే ప్రపంచకప్‌ (2011), ఛాంపియన్స్‌ ట్రోఫీ (2013) ధోనీ ఆధ్వర్యంలోనే వచ్చాయి. అంతకుమించిన అద్భుతమైన విజయాలు కూడా అందించాడు. అందుకే ఇప్పుడు టీమిండియాకు మెంటార్‌ అయ్యాడు. ఇప్పుడు మెంటార్‌గా తొలి టీ20 ప్రపంచకప్‌ను దేశానికి అందించడానికి ప్రణాళికలు వేస్తున్నాడు. ఈ సింహం జూలు ఆదివారం (అక్టోబరు 24న) తొలుత దాయాది పాకిస్థాన్‌ మీదే విదిలించబోతోంది. ప్రపంచకప్‌లో పాక్‌ మీద మనది అప్రతిహత జైత్రయాత్రనే అనే సంగతి తెలిసిందే. అయితే ధోనీ - కోహ్లీ - రవి శాస్త్రి కలసి ఎలా గెలిపిస్తారా అనేది చూడాలి. ఆల్‌ ది బెస్ట్‌ టీమిండియా... ఆల్‌ ది బెస్ట్‌ మెంటార్‌ సింగ్‌ ధోనీ. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని