WTC Final: టీమ్‌ఇండియా ఆ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగొచ్చు: రికీ పాంటింగ్

జూన్ 7 నుంచి ప్రారంభంకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final)లో భారత్‌ ఇద్దరు ప్రధాన స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముందని ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. 

Updated : 05 Jun 2023 16:53 IST

ఇంటర్నెట్ డెస్క్: లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final) జూన్ 7 నుంచి ప్రారంభంకానుంది. ఈ ప్రతిష్ఠాత్మక పోరులో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. మ్యాచ్‌ ఇంగ్లాండ్‌లో జరుగుతుండటం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం. ఆస్ట్రేలియాలో మాదిరిగానే ఇంగ్లాండ్‌ వాతావరణం ఉంటుంది. ఇంగ్లాండ్‌ పిచ్‌లు ఎక్కువగా పేస్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. దీంతో భారత్‌ ముగ్గురు ప్రధాన పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందా? లేక నాలుగు పేసర్లు, ఒక స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌తో ఆడుతుందా? అనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) భారత్‌ స్పిన్‌ బౌలింగ్‌ గురించి మాట్లాడాడు. భారత్ ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని.. రవిచంద్రన్ అశ్విన్‌ (Ashwin), రవీంద్ర జడేజాలను తుది జట్టులోకి తీసుకుంటుందని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. 

‘‘రవీంద్ర జడేజా (Ravindra Jadeja), రవిచంద్రన్ అశ్విన్‌లను భారత్‌ తుది జట్టులోకి తీసుకుంటుందని భావిస్తున్నా. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో జడేజా ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగలడు. అతని బ్యాటింగ్ ఎంతగానో మెరుగుపడింది. బౌలింగ్‌ కూడా చేస్తాడు. కాబట్టి.. అతనిని జట్టులోకి తీసుకుంటుందని అనుకుంటున్నా. జడేజా కంటే అశ్విన్ చాలా నైపుణ్యమున్న, మెరుగైన టెస్ట్ బౌలర్ అనడంలో సందేహం లేదు. లోయర్‌ ఆర్డర్‌లో జడేజా బ్యాటింగ్‌లో రాణిస్తే ఆట నాలుగు లేదా ఐదో రోజు వరకు వెళ్లొచ్చు. అలా కాకుండా పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా మారితే భారత్‌కు రెండో స్పిన్నర్‌గా జడేజా రూపంలో మంచి బౌలర్‌ ఉంటాడు. నేనైతే జడేజాను కచ్చితంగా ఎంపిక చేస్తా’’ అని రికీ పాంటింగ్‌ వివరించాడు. ఆస్ట్రేలియా ఒకే స్పిన్నర్‌ (నాథన్ లైయన్)తో బరిలోకి దిగే అవకాశం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని