ICC Rankings: పది స్థానాలు దూసుకొచ్చిన శ్రేయస్..

టెస్టు సిరీస్‌లో విఫలం కావడంతో విరాట్ కోహ్లీ (Virat Kohli) ర్యాంక్ కిందికి పడిపోగా.. ఆ సిరీస్‌లోనే అదరగొట్టిన శ్రేయస్‌ అయ్యర్ (Shreyas Iyer), రవిచంద్రన్ అశ్విన్‌ (Ravichandran Ashwin) మాత్రం ర్యాంకింగ్స్‌ (ICC Rankings)లో దూసుకొచ్చారు.

Updated : 28 Dec 2022 18:12 IST

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో విఫలమైన భారత స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ ర్యాంక్‌ దిగజారిపోయింది. అలాగే అద్భుత ప్రదర్శన చేసిన శ్రేయస్‌ అయ్యర్ తన కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకొన్నాడు. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ 12వ స్థానం నుంచి 14వ ర్యాంక్‌కు పడిపోయాడు. శ్రేయస్‌ అయ్యర్ ఏకంగా పది స్థానాలను మెరుగుపర్చుకొని 16వ ర్యాంక్‌కు దూసుకొచ్చాడు.  

ఆసీస్‌ బ్యాటర్ లబుషేన్ (936) అగ్రస్థానం దక్కించుకోగా.  బాబర్ అజామ్‌ (875), స్టీవ్‌ స్మిత్ (870) ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. భారత్‌ తరఫున రిషభ్‌ పంత్ (797) ఆరో స్థానం, కెప్టెన్ రోహిత్ శర్మ (732) మాత్రమే టాప్‌ -10లో చోటు సంపాదించారు. బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసినప్పటికీ పుజారా మాత్రం మూడు స్థానాలను కోల్పోయి 19వ ర్యాంక్‌కు పరిమితమయ్యాడు. 

అశ్విన్ అదరహో..

బంగ్లాపై రెండో టెస్టులో వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడిన రవిచంద్రన్ అశ్విన్ ర్యాంకింగ్స్‌లోనూ దూసుకెళ్లాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో అశ్విన్ (343) తన రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకొన్నాడు. అయితే షకిబ్ (329) కంటే పాయింట్లను మెరుగుపర్చుకొన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో టీమ్‌ఇండియా టాప్‌ ఆటగాడు రవీంద్ర జడేజా (369)దే అగ్రస్థానం. ఇక బౌలర్ల విభాగంలోనూ అశ్విన్‌ (812) ఐదో స్థానానికి చేరుకొన్నాడు. టాప్‌ -5లో ఏకైక స్పిన్నర్ అశ్విన్‌ కావడం విశేషం. మిగతా నలుగురు ప్యాట్ కమిన్స్ (880), జేమ్స్ అండర్సన్ (835), కగిసో రబాడ (824), బుమ్రా (812) ఫాస్ట్‌ బౌలర్లు. జట్టు ర్యాంకింగ్స్‌లోనూ భారత్‌ అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. అయితే ఇంగ్లాండ్‌ (266) కంటే కేవలం రెండు పాయింట్లను మాత్రమే అధికంగా సాధించింది. పాక్‌పై టెస్టు సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-0 తేడాతో కైవసం చేసుకోవడం కలిసొచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని