RAshwin: నా జీవితం నా ఇష్టం.. నేనిలాగే ఉంటా!

పోటీతత్వమే తనలోని అత్యుత్తమ ఆటగాడిని బయటకు తీసుకొస్తోందని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ అన్నాడు. నేర్చుకోవడం ఆపేసినప్పుడు ఆట నుంచి తప్పుకుంటానని పేర్కొన్నాడు. ఏదో ఒకటి సరికొత్తగా నేర్చుకోవాలన్న తపనే తన కెరీర్‌ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని.....

Published : 21 Jun 2021 01:16 IST

నేర్చుకోవడం ఆపేస్తే వీడ్కోలు పలుకుతా

సౌథాంప్టన్‌: పోటీతత్వమే తనలోని అత్యుత్తమ ఆటగాడిని బయటకు తీసుకొస్తోందని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ అన్నాడు. నేర్చుకోవడం ఆపేసినప్పుడు ఆట నుంచి తప్పుకుంటానని పేర్కొన్నాడు. ఏదో ఒకటి సరికొత్తగా నేర్చుకోవాలన్న తపనే తన కెరీర్‌ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని వెల్లడించాడు.

‘కెరీర్‌ సాగుతున్న కొద్దీ పరిపూర్ణత కోసం ప్రయత్నించడమే టెస్టు క్రికెట్లోని అందం. నిత్యం నేర్చుకొనేందుకు ప్రేరణ కల్పిస్తుంది. ఆ తత్వమే నా కెరీర్‌లో ఇన్ని విజయాలు సాధించేందుకు ఉపయోగపడింది. నేను ఏదో ఒక బిందువు వద్ద ఆగిపోలేదు. నిరంతరం మెరుగు పరుచుకొనేందుకే ప్రయత్నించా. భిన్నంగా ప్రయత్నించడం ఇష్టం లేనప్పుడు, కొత్తవి నేర్చుకొనే సహనం నశించినప్పుడు ఆడటం మానేస్తా’ అని యాష్‌ అన్నాడు.

సాధారణంగా అశ్విన్‌ స్వేచ్ఛగా తన భావాలను వ్యక్తం చేస్తుంటాడు. మరీ విమర్శలకు పోకున్నా బలంగా తన అభిప్రాయం చెప్తాడు. ‘వివాదాలు నాకేమీ ఇష్టంకాదు. పోరాటాన్ని నేనిష్టపడతా. నిజానికి ఆ తత్వం వల్లే నేనిక్కడున్నా. విజయాలకు ఎక్కువగా పొంగిపోను. ఎందుకంటే విజయమనేది ఒక సంఘటన. సాధన, ప్రణాళికతో అది సాధ్యమవుతుంది. ప్రతిసారీ ఇంకా మెరుగ్గా ఏం చేయాలనే ఆలోచిస్తా’ అని యాష్‌ పేర్కొన్నాడు.

‘నిజాయతీగా చెప్పాలంటే నా ప్రదర్శనలపై కథనాలను నేను పట్టించుకోను. నేను నాలాగే ఉంటాను. భారత్‌లో అతిగా పొగిడేస్తారు. కానీ నేనో సాధారణ వ్యక్తిని. క్రికెట్‌ ఆడుతూ మనశ్శాంతి, ఆనందం పొందుతాను. ఆట ఆడుతూ నా కుటుంబాన్ని పోషించుకోవడమే నాకు ఆనందం. నాకు బాగానే చెల్లిస్తున్నారు. క్రికెట్‌ ఆడటం వల్లే నా జీవితానికి ఒక అర్థం వస్తోంది. అందుకే నేను ఆసక్తిగా, ఆనందంగా ఉంటాను. ఎవరు పొగిడినా, తిట్టినా పట్టించుకోను. నా జీవితం నాది’ అని అశ్విన్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని