T20 World Cup: భారత్‌ను ఓడిస్తే పాక్‌ ఆటగాళ్లకు బ్లాంక్‌ చెక్‌!

భారత్‌- పాక్‌ మ్యాచ్‌ అనగానే క్రికెట్ ప్రేమికులకు ఎంతో ఉత్సాహం వస్తుంది. మ్యాచ్‌ ఎప్పుడూ ప్రారంభం అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. కాగా, భారత్‌-పాక్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో గత కొనేళ్లుగా కేవలం ఐసీసీ టోర్నీల్లోనే మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి.

Published : 09 Oct 2021 02:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌- పాక్‌ మ్యాచ్‌ అనగానే క్రికెట్ ప్రేమికులకు ఎంతో ఉత్సాహం వస్తుంది. మ్యాచ్‌ ఎప్పుడూ ప్రారంభం అవుతుందా? అని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. కాగా, భారత్‌-పాక్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో గత కొనేళ్లుగా కేవలం ఐసీసీ టోర్నీల్లోనే మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. అక్టోబ‌ర్ 17 నుంచి యూఏఈ వేదికగా టీ 20 ప్ర‌పంచ క‌ప్ జర‌గ‌నుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈ నెల 24న భారత్‌-పాక్ జ‌ట్లు ఎదురుపడనున్నాయి.  అయితే, టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఇరు జట్లు ఆరు సార్లు త‌ల‌ప‌డ‌గా 5 సార్లు టీమ్‌ఇండియా విజ‌యం సాధించింది.  ఒక మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ఆగిపోయింది. కాగా, అక్టోబరు 24న జరిగే మ్యాచ్‌లో భారత్‌పై పాక్ విజయం సాధిస్తే పాకిస్థాన్‌ ఆట‌గాళ్ల‌కు బ్లాంక్ చెక్కు ఇస్తామ‌ని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మ‌న్ ర‌మీజ్ రాజా సంచలన ప్రకటన చేశారు. బ్లాంక్‌ చెక్‌ ఇవ్వడానికి ఓ బలమైన ఇన్వెస్టర్ సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. ఇంటర్ ప్రావిన్షియల్ కో-ఆర్డినేషన్‌పై వేసిన సెనేట్ స్టాండింగ్ కమిటీ ముందు రమీజ్ రాజా ఈ వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి 50శాతం నిధులు వస్తున్నాయని వివరించారు. అయితే, ఐసీసీకి సుమారు 90 శాతం నిధులు ఒక్క భారత్ నుంచే వస్తుంటాయని పేర్కొన్నారు.  ఒకరకంగా చెప్పాలంటే భారత్‌లోని వ్యాపార సంస్థలే పాకిస్థాన్‌ క్రికెట్‌ను నడిపిస్తున్నాయని  వివరించారు. ఐసీసీకి బీసీసీఐ నుంచి నిధులు సమకూరకుంటే పాక్‌ క్రికెట్ బోర్డు కుప్పకూలుతుందని వ్యాఖ్యానించారు. ఇటీవల ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తమ దేశ పర్యటనను రద్దు చేసుకోవడంతో  రమీజ్ రాజా ఆగ్రహంతో ఉన్నారు. పాక్ క్రికెట్ బోర్డు.. బీసీసీఐలా ఆర్థికంగా బలంగా ఉంటే.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఇంతటి సాహసం చేసి ఉండేవి కాదని స్పష్టం చేశారు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ జట్టు భారత్‌తో పాటు న్యూజిలాండ్‌ని ఓడించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని