Shubhman Gill: మరో అవకాశం ఇస్తే.. ఎప్పటికీ కోల్కతా జట్టుకే ఆడాలనుకుంటున్నాను : శుభ్మన్ గిల్
కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంఛైజీ మరో అవకాశం ఇస్తే.. ఎప్పటికీ ఆ జట్టుకే ఆడాలనుకుంటున్నట్లు యువ ఆటగాడు శుభ్మన్ గిల్ అన్నాడు. కోల్కతా తరఫున ఆడిన కొంత మంది అత్యుత్తమ...
(Photo: KKR Twitter)
ఇంటర్నెట్ డెస్క్: కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంఛైజీ మరో అవకాశం ఇస్తే.. ఎప్పటికీ ఆ జట్టుకే ఆడాలని ఉందని యువ ఆటగాడు శుభ్మన్ గిల్ అన్నాడు. కోల్కతా తరఫున ఆడిన కొంత మంది అత్యుత్తమ ఆటగాళ్లతో కేకేఆర్ యాజమాన్యం రూపొందించిన ‘లవ్, ఫెయిత్ అండ్ బియాండ్’ అనే షార్ట్ ఫిలిమ్లో శుభ్మన్ గిల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆ షార్ట్ ఫిలిమ్ను కేకేఆర్ అధికారిక ట్విటర్ ఖాతాలో పంచుకుంది.
‘కోల్కతా ఫ్రాంఛైజీతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ ఫ్రాంఛైజీతో అనుబంధం ఏర్పడ్డాక.. ఎప్పటికీ అదే జట్టుకు ఆడాలనుకున్నాను. ఇప్పటికైనా యాజమాన్యం మరో అవకాశం ఇస్తే మళ్లీ కోల్కతా జట్టుకే ఆడాలనుకుంటున్నాను. ప్రతి సీజన్లో గొప్పగా రాణించడం ఎవరికీ సాధ్యం కాదు. కొన్నిసార్లు సరైన జోడీ దొరక్కపోవచ్చు. మరి కొన్నిసార్లు ఇతరత్ర కారణాల వల్ల విఫలం కావచ్చు. అలాగే, ప్రతి సీజన్లో జట్టు ప్రదర్శన కూడా ఒకేలా ఉండదు. గెలుపోటములు ఎదురవుతుంటాయి. వాటితో సంబంధం లేకుండా జట్టు సభ్యులతో గడిపిన విలువైన సమయాన్ని ఆస్వాదించాను’ అని శుభ్మన్ గిల్ అన్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం కేకేఆర్ యాజమాన్యం ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి లను ఇటీవల రిటెయిన్ చేసుకున్న విషయం తెలిసిందే.
శుభ్మన్ గిల్ను కేకేఆర్ ఫ్రాంఛైజీ 2018 ఐపీఎల్ సీజన్లో రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్లో ఆడిన 13 మ్యాచుల్లో 146.04 సగటుతో 203 పరుగులు చేశాడు. ఆ తర్వాతి సీజన్లలో కూడా నిలకడైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు కోల్కతా తరఫున 58 మ్యాచులు ఆడిన శుభ్మన్.. 123 సగటుతో 1,417 పరుగులు చేశాడు. న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో గాయపడిన గిల్ దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే.
‘మా ఫ్రాంఛైజీలో టాలెంట్ ఉన్న ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. వారందరినీ రిటెయిన్ చేసుకోలేకపోవడం కొంచెం బాధాకరం’ అని కేకేఆర్ ఎండీ, సీఈవో వెంకీ మైసూర్ అన్నాడు. ‘యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో కోల్కతా యాజమాన్యం ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది. ఆటగాళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిపూర్ణ క్రికెటర్లుగా ఎదిగేందుకు పూర్తి సహకారం అందించింది. శివం మావి, ప్రసిద్ధ్ కృష్ణ, కమలేశ్ నాగర్కోటి లాంటి ఎంతో మంది యువ ఆటగాళ్లకు యాజమాన్యం ఓ అవకాశం ఇచ్చి ప్రోత్సహించింది’ అని కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సహా దినేశ్ కార్తిక్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా వంటి కీలక ఆటగాళ్లను కూడా కోల్కతా యాజమాన్యం పక్కన పెట్టింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరుగనున్న ఐపీఎల్ మెగా వేలంలో వీరిని దక్కించుకుంటుందేమో చూడాలి.!
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్