Dilip Vengsarkar: ఇలాంటి పెద్ద టోర్నీల్లో ప్రయోగాలా?.. తప్పుబట్టిన మాజీ సెలక్టర్‌

రానున్న ప్రపంచకప్‌ కోసం బలమైన జట్టును నిర్మించుకునే ప్రయత్నంలో భాగంగా.. ఆసియా కప్‌లో భారత్‌ భిన్న కూర్పులను ప్రయత్నించింది........

Published : 10 Sep 2022 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రానున్న ప్రపంచకప్‌ కోసం బలమైన జట్టును నిర్మించుకునే ప్రయత్నంలో భాగంగా.. ఆసియా కప్‌లో భారత్‌ భిన్న కూర్పులను ప్రయత్నించింది. కొందరిని పక్కనపెట్టి మరికొందరికి అవకాశమిచ్చింది. కానీ ఈ మార్పులు టీమ్‌ఇండియాకు మంచి ఫలితాలను ఇవ్వలేదు. పాకిస్థాన్‌, శ్రీలంక చేతిలో ఓటమితో ఫైనల్‌కు చేరుకోకుండానే జట్టు ఇంటిముఖం పట్టింది. అయితే, ఆసియా కప్‌లో చేపట్టిన మార్పులపై టీమ్‌ఇండియా మాజీ సెలక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ స్పందిస్తూ.. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పలు జట్లు పాల్గొనే ఇలాంటి పెద్ద టోర్నీలో ఈ తరహా ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. పెద్ద టోర్నీల్లో గెలవడం జట్టు నైతికతకు కీలకమన్నారు.

‘జట్టు కూర్పులో పలు మార్పులు చేసుకుంటూ పోయారు. దినేశ్‌ కార్తీక్‌కు ఎంపిక చేసినా.. అతడు ఆడేందుకు పెద్దగా అవకాశాలివ్వలేదు. రవిచంద్రన్‌ అశ్విన్‌కు మొదటిసారి శ్రీలంకతో ఆడే అవకాశం ఇచ్చారు. ప్రపంచకప్‌ కోసం ఉత్తమ టీమ్‌ XIను గుర్తించే పనిలో భాగంగా ఇలా చేశారని తెలుస్తోంది. కానీ ఈ టోర్నీ కూడా చాలా ముఖ్యమే కదా. ఆసియా కప్ ఓ పెద్ద టోర్నమెంట్‌’ అని మాజీ సెలక్టర్‌ వ్యాఖ్యానించారు.

‘ఇలాంటి టోర్నీల్లో మ్యాచ్‌లు గెలవడం జట్టు నైతికతకు చాలా ముఖ్యం. అలాగే విన్నింగ్ కాంబినేషన్‌ను కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యమని భావిస్తున్నా. ఆసియా కప్ చాలా పెద్ద ఈవెంట్. ద్వైపాక్షిక సిరీస్‌లలో ప్రయోగాలు చేయొచ్చు. కానీ ఆసియా కప్, ప్రపంచ కప్ ఇవి ప్రధాన టోర్నమెంట్లు. ఈ టోర్నమెంట్లలో గెలవడమే చాలా ముఖ్యం’ అని దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని