WTC Final: చెలరేగిన ట్రావిస్‌ హెడ్, స్మిత్.. తొలి రోజు ఆధిపత్యం ఆసీస్‌దే

టీమ్‌ఇండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో మొదటి రోజు ఆసీస్‌దే ఆధిపత్యం. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది.

Updated : 07 Jun 2023 22:53 IST

లండన్: టీమ్‌ఇండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో మొదటి రోజు ఆసీస్‌దే ఆధిపత్యం. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (146*; 156 బంతుల్లో) సెంచరీ బాదాడు. స్టీవ్‌ స్మిత్ (95*) శతకానికి చేరువయ్యాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0) డకౌట్‌గా వెనుదిరిగినా.. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ (43; 60 బంతుల్లో 8 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. మార్నస్‌ లబుషేన్ (26) పరుగులు చేశాడు. టీమ్‌ఇండియా బౌలర్లలో మహ్మద్‌ షమి, సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. సిరాజ్‌ వేసిన 3.4 ఓవర్‌కు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0) వికెట్ కీపర్ శ్రీకర్‌ భరత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తర్వాత లబుషేన్‌తో కలిసి మరో ఓపెనర్‌ వార్నర్‌ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. లబుషేన్ నెమ్మదిగా ఆడినా.. వార్నర్‌ నిలకడగా బౌండరీలు బాదాడు. ఉమేశ్‌ వేసిన 15వ ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు కొట్టాడు. వార్నర్‌ దూకుడుకు శార్దూల్ అడ్డుకట్ట వేశాడు. ఠాకూర్‌ వేసిన 21.4 ఓవర్‌కు వార్నర్ కేఎస్ భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలో భోజన విరామ సమయానికి ఆసీస్‌ రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. లంచ్‌ నుంచి రాగానే  మంచి టచ్‌ మీద కనిపిస్తున్న లబుషేన్‌ను షమి బౌల్డ్‌ చేశాడు. 

ఆదుకున్న హెడ్, స్మిత్ 

76 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను ట్రావిస్ హెడ్, స్మిత్‌ ఆదుకున్నారు. ఆరంభంలో స్మిత్‌ చాలా నెమ్మదిగా ఆడినా.. హెడ్‌ క్రీజులోకి రావడంతోనే దూకుడుగా ఆడాడు. నిలకడగా బౌండరీలు బాదాడు. 60 బంతుల్లో అర్ధ శతకం అందుకున్న హెడ్ .. తర్వాత సైతం అదే దూకుడు కొనసాగించాడు. ఈ క్రమంలో టీ విరామ సమయానికి ఆసీస్ 170/3తో నిలిచింది. చివరి సెషన్‌లో ఆరంభంలోనూ నెమ్మదిగా ఆడిన స్మిత్ తర్వాత దూకుడు పెంచాడు. షమి వేసిన 59వ ఓవర్లో హెడ్‌ వరుసగా ఫోర్, సిక్స్ బాదగా.. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో స్మిత్ రెండు ఫోర్లు కొట్టాడు. సిరాజ్‌ వేసిన 62 ఓవర్‌లో స్మిత్ అర్ధ శతకం (144 బంతుల్లో) అందుకున్నాడు. షమి వేసిన 65వ ఓవర్‌లో హెడ్ సెంచరీ (106 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. అర్ధ శతకం చేసిన తర్వాత స్టీవ్ స్మిత్ దూకుడు పెంచాడు. సిరాజ్‌ వేసిన 66వ ఓవర్‌లో చివరి బంతిని బౌండరీకి పంపిన అతడు.. శార్దూల్ వేసిన 68 ఓవర్లోనూ ఓ ఫోర్ బాదాడు. జడేజా వేసిన 69వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు రాబట్టాడు. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోయి నిలకడగా బౌండరీలు సాధించడంతో స్కోరు 300 దాటింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు