IND vs ENG: నాలుగో రోజు ముగిసిన ఆట.. భారత్‌ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే!

మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తున్న ఇంగ్లాండ్‌ జట్టు ఆ దిశగా సాగుతోంది. 378 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అతిథ్య జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 259 పరుగుల చేసింది.

Updated : 04 Jul 2022 23:27 IST

బర్మింగ్‌హామ్‌: మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తున్న ఇంగ్లాండ్‌ జట్టు ఆ దిశగా సాగుతోంది. 378 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అతిథ్య జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 259 పరుగుల చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 119 పరుగులు కావాలి. అర్ధశతకాలతో చెలరేగిన జో రూట్‌(76), జానీ బెయిర్‌స్టో(72) క్రీజులో ఉన్నారు. ఇక ఒకరోజు ఆట మాత్రమే మిగిలిఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించాలంటే 7 వికెట్లు తీయాల్సిందే. ఒకవేళ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిస్తే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంటుంది. అంతకుముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 125/3తో ఆట ప్రారంభించిన భారత్‌ మరో 120 పరుగులకే ఆలౌటైంది. పంత్‌(57) అర్ధశతకం చేశాడు. ఇప్పటికే 2-1 తేడాతో ముందంజలో ఉన్న భారత్‌ సిరీస్‌ నెగ్గాలంటే ఈ మ్యాచ్‌లో విజయమైనా సాధించాలి లేదా డ్రా అయినా చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఇంగ్లాండ్‌ ఈ మ్యాచ్‌లో నెగ్గితే 2-2తో సిరీస్‌ సమం అవుతుంది. 

 

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌ ఆటగాడు జోరూట్‌ (52) హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 71 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో అర్ధశతకం సాధించాడు. అతడికి జానీ బెయిర్‌స్టో (39) నుంచి మంచి సహకారం లభిస్తోంది. దీంతో వీరిద్దరూ ఇప్పటివరకు 90 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో 46 ఓవర్లకు ఇంగ్లాండ్‌ స్కోర్‌ 201/3గా మారింది. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 177 పరుగులు కావాలి.


బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జోరూట్‌ (43), జానీ బెయిర్‌ స్టో (22) ప్రమాదకరంగా మారుతున్నారు. ఇప్పటికే వీరిద్దరు 65 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే 40 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్‌ స్కోర్‌ 174/3గా నమోదైంది. 109కే మూడు వికెట్లు పడిపోయిన వేళ క్రీజులోకి వచ్చిన వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడుతున్నారు. మొదట వికెట్‌ కాపాడుకునేందుకు నెమ్మదిగా ఆడిన వీరి ఇప్పుడు క్రీజులో కుదురుకున్నాక బౌండరీలు బాదుతున్నారు. దీంతో ఇప్పటివరకు 95 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఇంగ్లాండ్‌ విజయానికి ఇంకా 204 పరుగులు కావాలి.


 

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జోరూట్‌ (20), జానీ బెయిర్‌స్టో (7) నిలకడగా ఆడుతున్నారు. స్వల్ప వ్యవధిలో ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే రూట్‌ రెండుసార్లు ఎల్బీడబ్ల్యూ ప్రమాదాల నుంచి తప్పించుకున్నాడు. దీంతో టీమ్‌ఇండియా రెండు రివ్యూలను వృథా చేసుకుంది. ఇక షమి వేసిన 32వ ఓవర్లో రూట్‌ రెండు ఫోర్లు బాదాడు. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్‌ 136/3గా ఉంది. ఇంకా విజయానికి 242 పరుగులు కావాలి.


బర్మింగ్‌హామ్‌: టీ విరామం అనంతరం ఇంగ్లాండ్‌ తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. మూడో సెషన్‌ ఆరంభమైన తొలి బంతికే బుమ్రా బౌలింగ్‌లో తొలుత పోప్‌(0) కీపర్‌ పంత్‌ చేతికి చిక్కాడు. తర్వాత జడేజా వేసిన మరుసటి ఓవర్‌ తొలి బంతికే అలెక్స్‌ లీస్‌ (56) రనౌటయ్యాడు. అంతకుముందు విరామానికి ముందు ఓపెనర్‌ క్రాలే (46) బుమ్రా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో ఇంగ్లాండ్‌ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో జోరూట్‌ (2), జానీ బెయిర్‌స్టో (4) ఉన్నారు. 25 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 114/3గా నమోదైంది. ఇంగ్లాండ్‌ విజయానికి ఇంకా 264 పరుగులు కావాలి.


బర్మింగ్‌హామ్‌: నాలుగో రోజు రెండో సెషన్‌ పూర్తయింది. ఈ సెషన్‌లో మొత్తం 31.5 ఓవర్ల ఆట సాగగా ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడుతోంది. టీ విరామ సమయానికి ఆ జట్టు 107/1తో నిలిచి వేగంగా పరుగులు సాధిస్తోంది. ఓపెనర్లు అలెక్స్‌ లీస్‌ (56), జాక్‌ క్రాలే తొలి వికెట్‌కు 107 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే బుమ్రా వేసిన 22వ ఓవర్‌లో క్రాలే బౌల్డయ్యాడు. దీంతో ఆ జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం పోప్‌(0) క్రీజులోకి రాగా మరుసటి ఓవర్‌లోనే అంపైర్లు టీ విరామాన్ని ప్రకటించారు. ఈ రోజు ఇంకా 36 ఓవర్ల ఆట మిగిలి ఉండగా ఇంగ్లాండ్‌ విజయానికి 271 పరుగులే కావాలి.


బర్మింగ్‌హామ్‌: ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ ఎట్టకేలకు తొలి వికెట్‌ పడగొట్టింది. జాక్‌ క్రాలీ (46)ని కెప్టెన్‌ బుమ్రా చక్కటి బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో 107 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యం విడిపోయింది. 22 ఓవర్లలో ఇంగ్లాండ్‌ వికెట్‌ నష్టానికి 107 పరుగులు చేసింది. అలెక్స్‌ లీస్‌ (56*), ఓలీ పోప్‌ (0*) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్‌ విజయానికి ఇంకా 271 పరుగులు కావాలి.


ఇంగ్లాండ్‌ ఓపెనర్ల దూకుడు కొనసాగుతోంది. 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లిష్‌ ఓపెనర్లు అలెక్స్‌ లీస్‌ (54*), జాక్‌ క్రాలే (45*) దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో జట్టు స్కోరు వంద దాటింది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్‌ వికెట్‌ నష్టపోకుండా 104 పరుగులు చేసింది. మరోవైపు వికెట్‌ కోసం భారత బౌలర్లు చేస్తున్న శ్రమ ఫలించడం లేదు. ఇంగ్లాండ్‌ విజయానికి ఇంకా 274 పరుగులు కావాలి.


ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ అలెక్స్‌ లీస్‌ (53) అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. సిరాజ్ వేసిన 15.5 ఓవర్‌కు అతడు బౌండరీ బాది 50 పరుగులను పూర్తిచేసుకున్నాడు. మరోవైపు జాక్‌ క్రాలే (27) అతడికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. దీంతో వారిద్దరూ కలిసి 17 ఓవర్లలోనే జట్టు స్కోరును 81 పరుగులకు చేరవేశారు. మరోవైపు వీరిని ఔట్‌ చేసేందుకు భారత బౌలర్లు ఆపసోపాలు పడుతున్నారు. ఇంగ్లాండ్‌ విజయానికి ఇంకా 297 పరుగులు కావాలి.


బర్మింగ్‌హామ్‌: టీమ్‌ఇండియా నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. అలెక్స్‌ లీస్‌ (31), జాక్‌ క్రాలే (21) మెరుగైన రన్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ 10 ఓవర్లకు 53 పరుగులు చేసి భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇంగ్లాండ్‌ ఓపెనర్లను పెవిలియన్‌ పంపేందుకు టీమ్‌ఇండియా తీవ్రంగా కష్టపడుతోంది. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 325 పరుగులు కావాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని