IND vs ENG: భారత్‌ X ఇంగ్లాండ్‌.. ‘విజయ’విహారం చేసిందెవరు?

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య నేడు సెమీస్‌ మ్యాచ్‌ జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లో పైచేయి ఎవరిది..? అంతర్జాతీయ టీ20లో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య ప్రదర్శన ఎలా ఉంది?  

Updated : 10 Nov 2022 12:02 IST

(Photo: Adelaide Oval Twitter)

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఉత్తమ ప్రదర్శనతో జోరుమీదున్న టీమ్‌ఇండియా మెగా టైటిల్‌ ఆశలను నిలుపుకోవాలంటే.. గురువారం జరిగే సెమీస్‌లో ఇంగ్లీష్‌ జట్టు పని పట్టాల్సిందే. అయితే అది రోహిత్‌ సేనకు కఠిన సవాలే. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఫేవరెట్‌గా కన్పిస్తున్నా.. ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయలేం. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య పోరు రికార్డు గట్టిగా ఉంది. గతంలో ఈ రెండు జట్లు 22 సార్లు తలపడగా.. విజయాలు దాదాపు సమంగానే ఉన్నాయి. సెమీస్‌ పోరు సందర్భంగా గతంలో ఇరు జట్ల ప్రదర్శనలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..

 అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌, ఇంగ్లాండ్‌ ఇప్పటివరకు 22 సార్లు ఢీకొన్నాయి. వీటిలో భారత్‌ 12 సార్లు గెలవగా.. ఇంగ్లాండ్‌ 10సార్లు విజయం సాధించింది.

ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 3 మ్యాచ్‌ సిరీస్‌ను టీమిండియా 2-1తో చేజిక్కించుకుంది. ఇక గతేడాది మార్చిలో సొంతగడ్డపై జరిగిన 5 టీ20ల సిరీస్‌లో 3-2తో పైచేయి సాధించింది.

భారత్, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన చివరి ఐదు టీ20 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా నాలుగు సార్లు విజయం సాధించగా.. ఇంగ్లాండ్‌ ఒక్కసారే గెలిచింది.

ఈ ఏడాది జులైలో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్‌పై ఇంగ్లాండ్‌ 215 పరుగుల అత్యధిక స్కోరు సాధించింది.

ఇక టీ20 ప్రపంచకప్‌లో ఇరుజట్లు మూడుసార్లు (2007, 2009, 2012) తలపడ్డాయి. అందులో భారత్‌ రెండు, ఇంగ్లాండ్‌ ఒక మ్యాచ్‌ గెలిచాయి.

డర్బన్‌ వేదికగా 2007 సెప్టెంబర్‌ 19న జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. తొలుత టీమ్‌ఇండియా 218/4 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌కు దిగి 200/6 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లోనే స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో యువరాజ్‌సింగ్‌ (58) ఆరు బంతుల్లో ఆరు సిక్సుల రికార్డు సృష్టించాడు. 12 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

రెండో మ్యాచ్‌.. 2009 ప్రపంచకప్‌లో లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో జరిగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తడబడి 150/5 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్‌ చేతిలో 3 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఇక మూడో మ్యాచ్‌.. 2012 ప్రపంచకప్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో 90 పరుగుల భారీ తేడాతో భారత్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 170/4 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ 14.4 ఓవర్లలో 80 పరుగులకే ఆలౌటైంది. భారత్‌పై ఇంగ్లీష్‌ జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే.

ఇంగ్లాండ్‌పై విరాట్‌ కోహ్లీ అత్యధికంగా 589 పరుగులు చేశాడు. ఆ తర్వాత రోహిత్‌ శర్మ 383 పరుగులు సాధించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా 117 పరుగులతో ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.

ఇక అత్యధిక వికెట్లు పడగొట్టింది యుజ్వేంద్ర చాహల్‌. 11 మ్యాచుల్లో 16 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్యా 13 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు, భువి 9 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు.

భారత్‌పై జోస్‌ బట్లర్‌ అత్యధికంగా 395 పరుగులు సాధించాడు. అలెక్స్‌ హేల్స్‌ 245 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియాపై అత్యధిక వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌. 14 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు. మెయిన్‌ అలీ 8 మ్యాచ్‌ల్లో 7, అదిల్ రషీద్‌ 11 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు పడగొట్టారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని