IND vs NZ:  శ్రేయస్‌ అయ్యర్‌ స్టాండ్‌ ఔట్‌ ఆటగాడు: వీవీఎస్

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ను మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ‘స్టాండ్‌ ఔట్‌ ప్లేయర్‌’గా అభివర్ణించాడు...

Updated : 07 Dec 2021 19:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ను మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ‘స్టాండ్‌ ఔట్‌ ప్లేయర్‌’గా అభివర్ణించాడు. కాన్పూర్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో అయ్యర్‌ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు తొలి మ్యాచ్‌లోనే శతకం, అర్ధశతకం బాది.. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. తాజాగా అతడి ఆటతీరును మెచ్చుకుంటూ లక్ష్మణ్‌ ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడాడు.

‘ఈ సిరీస్‌లో శ్రేయస్‌ స్టాండ్‌ ఔట్ ప్లేయర్‌గా నిలిచాడు. తన తొలి టెస్టులోనే ఒత్తిడిని జయిస్తూ రాణించిన తీరు అద్భుతం. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడిన క్లిష్టపరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు.. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొని బ్యాటింగ్‌ చేశాడు. తర్వాత శతకం సాధించాడు. ఇక టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లోనూ పీకల్లోతు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చాడు. 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఒత్తిడిలో శ్రేయస్‌ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అర్ధ శతకం సాధించాడు. దీంతో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతడు మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు’ అని లక్ష్మణ్‌ ప్రశంసించాడు.

సిరాజ్‌.. టీమ్‌ఇండియాకు గొప్ప ఆస్తి

అలాగే, హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్ టీమ్ఇండియాకు గొప్ప ఆస్తి అని లక్ష్మణ్‌ అన్నాడు. ముంబయి వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ టాప్ ఆర్డర్‌ను సిరాజ్‌ కుప్పకూల్చిన విషయం తెలిసిందే. ‘రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్‌ పక్కా ప్రణాళికతో బౌలింగ్ చేశాడు. షార్ట్ పిచ్‌ బంతులతో కివీస్‌ టాప్‌ ఆర్డర్‌ని కుప్పకూల్చాడు. టెస్టు మ్యాచ్‌ బౌలర్‌గా గొప్ప పరిణతి సాధించాడు. టీమ్‌ఇండియా.. ఆస్ట్రేలియా పర్యటనలో ఇషాంత్ శర్మ, మహమ్మద్‌ షమి, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక బౌలర్లు దూరమైన సమయంలో సిరాజ్ అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో కూడా మెరుగ్గా రాణించాడు. అతడి బౌలింగ్‌లో వైవిధ్యం ఉంది. కీలక సమయాల్లో కచ్చితత్వంతో బంతులేస్తూ.. ప్రత్యర్థి జట్టును దెబ్బతీయగలడు. అందుకే, టీమ్ఇండియాకు అతడు గొప్ప ఆస్తి’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని