IND vs PAK: భారత్‌ - పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ముందు కోహ్లీ, బాబర్‌ ఏమన్నారంటే?

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ఎన్నో కోట్ల మంది చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ మ్యాచ్‌ జరిగే రోజు రానే వచ్చింది. ఈరోజు సాయంత్రం...

Updated : 24 Oct 2021 09:48 IST

(Photos: Kohli, Babar Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ఎన్నో కోట్ల మంది చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ మ్యాచ్‌ జరిగే రోజు రానే వచ్చింది. ఈరోజు సాయంత్రం దుబాయ్‌ వేదికగా జరిగే అత్యంత కీలక పోరులో దాయాది దేశాలు పోటీపడుతున్నాయి. దీంతో అందరి దృష్టీ ఈ మ్యాచ్‌పైనే పడింది. అయితే, టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌ ఆడేముందు రెండు జట్ల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు. ఏమన్నారో వారి మాటల్లోనే..

‘‘పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అనగానే ఒత్తిడి ఉంటుంది. అంతేకాదు బయట నుంచి రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మామూలే. మేం ప్రొఫెషనల్‌ క్రికెటర్స్‌. క్రికెట్‌ గురించి మాత్రమే ఆలోచించాలి. మిగిలిన మ్యాచ్‌ల్లాగే ఇదొక మ్యాచ్‌లా భావించాలి. పాక్‌తో మ్యాచ్‌లో మైదానంలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. కానీ మా మానసిక స్థితి, సన్నద్ధత మాత్రం ఎప్పటిలాగే ఉంటాయి. తుది జట్టు వివరాలు వెల్లడించలేను. వీలైనంత సమతూకంతో కూడిన జట్టునే పాక్‌తో మ్యాచ్‌లో బరిలో దించుతాం. ప్రస్తుతం భారత్‌ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇటీవల ఐపీఎల్‌ ఆడిన అనుభవంతో ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి తమ పాత్రలేంటో స్పష్టత ఉంది. టోర్నీకి మంచి సన్నద్ధతతో వచ్చాం’’  - టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లి

‘‘గతం గురించి మాకవసరం లేదు. ఈ ప్రపంచకప్‌పైనే మా దృష్టి. మా సామర్థ్యం, నైపుణ్యాలపై శ్రద్ధ పెట్టి మ్యాచ్‌లో వాటిని ప్రదర్శిస్తాం. పరిస్థితులను సాధారణంగా ఉంచడం, ప్రాథమిక అంశాలను పట్టించుకోవడం ముఖ్యం. ఇప్పటికే భారత్‌తో ప్రపంచకప్‌ల్లో ఆడాం. ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన చేశాం. ఆ జట్టుతో పోరును ఎంత సాధారణంగా ఉంచితే అంత మాకే మంచిది. ప్రశాంతంగా ఉండడం ప్రధానం. షోయబ్‌ స్పిన్‌ బాగా ఆడగలడు. అందుకే సర్ఫరాజ్‌ను కాదని అతణ్ని తుది జట్టులోకి తీసుకున్నాం’’  - పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని