Virat Kohli: కోహ్లీ వందో టెస్టు.. రాహుల్‌ ద్రవిడ్‌ స్పెషల్‌ క్యాప్‌..!

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్నాడు. మొహాలి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న..

Updated : 04 Mar 2022 11:00 IST

(Photo: BCCI Twitter)

మొహాలి: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్నాడు. మొహాలి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో అతడు ఈ అరుదైన ఘనత సాధించాడు. ఈ మైలురాయి చేరుకున్న 71వ అంతర్జాతీయ ఆటగాడిగానే కాకుండా టీమ్‌ఇండియా తరఫున 12వ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా భారత జట్టు ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ ‘ప్రత్యేకమైన జ్ఞాపికతో పాటు వందో టెస్టు క్యాప్‌’ అందజేశాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు జరిగిన ఈ వేడుకలో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా పాల్గొన్నారు.

ఇక కోహ్లీ ఈ మైలురాయి చేరుకోవడంపై మాట్లాడిన ద్రవిడ్‌.. విరాట్‌ ఈ ఘనత సాధించడానికి నిజమైన అర్హుడని, అందుకోసం ఎంతో కష్టపడ్డాడని మెచ్చుకున్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని శిఖరాలు అధిరోహించేందుకు ఈ వందో టెస్టు కోహ్లీకి కొత్త ఆరంభమని పేర్కొన్నాడు. భవిష్యత్‌లో 200 టెస్టులు ఆడాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. అనంతరం కోహ్లీ మాట్లాడుతూ భావోద్వేగం చెందాడు. తన చిన్ననాటి హీరోల్లో ఒకరైన ద్రవిడ్‌ నుంచి వందో టెస్టు క్యాప్‌ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా తరఫున ఆడేందుకు తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానని తెలిపాడు. తన జీవితంలో ఇదో ప్రత్యేకమైన సందర్భం అని, ఈ వేడుకను చూడటానికి తన భార్య అనుష్కతో పాటు కుటుంబసభ్యులు వచ్చారన్నాడు. తాను వంద టెస్టులు ఆడటం పట్ల వారందరూ గర్వంగా ఉన్నారన్నాడు. క్రికెట్‌ అనేది జట్టుగా ఆడే ఆటని, ద్రవిడ్‌ లాంటి గొప్ప వ్యక్తులు లేకపోతే తాను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని