U 19 World Cup: అండర్‌ - 19 మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేతగా టీమ్‌ఇండియా

భారత అమ్మాయిలు అద్భుతం చేశారు. తొలిసారి నిర్వహించిన అండర్‌ - 19 ప్రపంచకప్‌ను టీమ్‌ఇండియా సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Updated : 29 Jan 2023 21:14 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత అమ్మాయిలు అద్భుతం చేశారు. తొలిసారి నిర్వహించిన అండర్‌ - 19 ప్రపంచకప్‌ను టీమ్‌ఇండియా సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకొన్న భారత్‌.. పిచ్‌ పరిస్థితులను పూర్తిగా సద్వినియోగం చేసుకొంది. ఇంగ్లాండ్‌ను కేవలం 17.1 ఓవర్లలో 68 పరుగులకు కుప్పకూల్చింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో రైనా మాక్‌డొనాల్డ్‌ గే (19) టాప్‌ స్కోరర్‌. మిగతా వారిలో కెప్టెన్‌ గ్రేస్ స్కివెన్స్ 4, లిబెర్టీ హీప్ డకౌట్, నిమా హోలాండ్‌ 10, సెరెన్ స్మాలె 3, క్రిస్‌ పావలే 2, అలెక్సా 11, జోసీ గ్రోవ్స్ 4, సోఫీ స్మాలె 11 పరుగులు సాధించారు. భారత బౌలర్లలో టిటాస్ సధు 2, అర్చనా దేవి 2, పర్షవి చోప్రా 2.. మన్నత్‌ కశ్యప్, షఫాలీ వర్మ, సోనమ్‌ యాదవ్ తలో వికెట్‌ తీశారు. 

నిలకడగానే ఛేదన.. తెలుగమ్మాయి కీలక పాత్ర

పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఛేదనలో భారత బ్యాటర్లు ఏమాత్రం రిస్క్‌ తీసుకోలేదు. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు షఫాలీ వర్మ (15), శ్వేత షహర్వాత్‌ (5) ఔటైనప్పటికీ.. తెలుగమ్మాయి గొంగడి త్రిష (24)తో కలిసి సౌమ్య తివారి (24*) కీలక భాగస్వామ్యం నిర్మించింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. దీంతో భారత్‌ విజయం సాధించడంలో తెలుగమ్మాయి ముఖ్య భూమిక పోషించింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకపోయినా.. నిలకడగా ఆడింది. అయితే మరో రెండు పరుగులు చేస్తే టీమ్‌ఇండియా విజయం సాధిస్తుందనగా.. త్రిష ఔటైంది. సౌమ్య తివారి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 14 ఓవర్లలో 69/3 స్కోరుతో భారత్‌ను గెలిపించింది. దీంతో అరంగేట్ర అండర్‌ - 19 టీ20 ప్రపంచకప్‌ టీమ్‌ఇండియా సొంతమైంది. గతంలో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని భారత్‌ కూడా తొలిసారి నిర్వహించిన 2007 టీ20 ప్రపంచకప్‌ను ఇలానే గెలుచుకొన్న విషయం తెలిసిందే.

రూ. 5 కోట్ల నజరానా..

టీమ్‌ఇండియా అద్భుతమైన విజయం సాధించడంతో బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు.  భారత్‌లో మహిళా క్రికెట్‌ పురోగమనంలో ఉంది. ఇప్పుడు అండర్‌ - 19 ప్రపంచ కప్‌లో విజేతగా నిలవడంతో మహిళల క్రికెట్‌ ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి రూ. 5 కోట్లను నజరానాగా 
ప్రకటించినందుకు సంతోషిస్తున్నా.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని