IND vs PAK: పాకిస్థాన్‌ చిత్తు.. భారత్‌ ఘన విజయం

బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో రాణించిన టీమ్‌ఇండియా ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌లో పాక్‌ను చిత్తు చేసింది. భారీ తేడాతో ఘన విజయం సాధించడంలో విరాట్, కేఎల్ రాహుల్, కుల్‌దీప్‌ యాదవ్‌ కీలక పాత్ర పోషించారు.

Updated : 11 Sep 2023 23:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాకిస్థాన్‌ను టీమ్‌ఇండియా చిత్తు చేసింది. రెండు రోజులపాటు సాగిన మ్యాచ్‌లో ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది. ఆసియా కప్‌ 2023 సూపర్ -4లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై భారత్‌ 228 పరుగుల తేడాతో (IND vs PAK) ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 356/2 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌ 32 ఓవర్లలో 128/8 స్కోరు వద్ద ఉన్నప్పుడు.. చివరి బ్యాటర్లు బ్యాటింగ్‌కు రాకపోవడంతో ఆలౌట్‌గా పరిగణించడం జరిగింది. కుల్‌దీప్‌ యాదవ్‌ (5/25) ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. సూపర్‌ ఇన్నింగ్‌తో చెలరేగిన విరాట్‌ కోహ్లీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వచ్చింది. ఈ విజయంతో సూపర్ -4 పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. మంగళవారమే శ్రీలంకతో ఇదే స్టేడియంలో మరో పోరుకు భారత్‌ సిద్ధం కావాల్సి ఉంది. 

కుదురుకోనీయని బౌలర్లు

భారత్ నిర్దేశించిన 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను బుమ్రా ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఇమామ్‌ (9*) వికెట్‌ తీసిన బోణీ కొట్టిన భారత్.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లను ఎక్కువగా క్రీజ్‌లో కుదురుకోనీయలేదు. ఏ దశలోనూ లక్ష్యం దిశగా పాక్‌ ఇన్నింగ్స్ సాగలేదు. అయితే ఫఖర్ జమాన్ (27), అఘా సల్మా్‌న్ (23), ఇఫ్తికార్‌ అహ్మద్ (23) కాస్త పరుగులు చేశారు. లేకపోతే పాక్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. దీని కారణం మాత్రం కుల్‌దీప్‌ యాదవ్‌ (5/25). పాండ్య, బుమ్రా, ఠాకూర్‌తో కలిసి పాక్‌ టాప్ ఆర్డర్ భరతం పట్టాడు. వైవిధ్యభరిత బంతులను సంధించి వికెట్లు తీశాడు. కుల్‌దీప్‌ దెబ్బకు ఎవరూ క్రీజ్‌లో ఉండలేకపోయారు. భారత బౌలర్లలో కుల్‌దీప్‌ కాకుండా బుమ్రా, పాండ్య, ఠాకూర్ తలో వికెట్‌ తీశారు.

తొలుత వారిద్దరు.. తర్వాత వీరిద్దరు

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్ (58), రోహిత్ శర్మ (56) అర్ధశతకాలతో అదరగొట్టే ఆరంభం ఇచ్చారు. అయితే, స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో భారత అభిమానులు ఆందోళనకు చెందారు. అయితే, రిజర్వ్‌డేకు వచ్చిన మ్యాచ్‌లో అభిమానులను ఆనందపరుస్తూ కేఎల్ రాహుల్ (111*), విరాట్ కోహ్లీ (122*) సెంచరీలతో అలరించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 233 పరుగులు జోడించారు. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగిన కేఎల్ రాహుల్‌ ఎంతో సాధికారికంగా ఆడాడు. ఇక విరాట్ కోహ్లీ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడినా.. ఒక్కసారి కుదురుకున్నాక చెలరేగిపోయాడు. ఈ క్రమంలో కెరీర్‌లో 47వ వన్డే శతకం పూర్తి చేసుకోవడ విశేషం. పాక్‌ బౌలర్లు షహీన్, షాదాబ్‌ చెరో వికెట్‌ తీశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు