INDw Vs UAEw: అమ్మాయిలూ భళా.. ఆసియా కప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌ విజయం

ఆసియా కప్‌లో భారత మహిళా క్రికెట్‌ జట్టు వరుసగా మూడో విజయం సాధించింది. దీంతో సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. తాజాగా యూఏఈపై వందకుపైగా పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.

Updated : 04 Oct 2022 16:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌లో భారత మహిళా క్రికెట్‌ జట్టు అదరగొట్టేస్తోంది. వరుసగా మూడో విజయం సాధించి గ్రూప్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మీద 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ నెగ్గిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకొంది.  దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో యూఏఈ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 74 పరుగులే చేసి ఓటమిపాలైంది. టీమ్‌ఇండియా బౌలర్ల దెబ్బకు ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన యూఏఈ కోలుకోలేకపోయింది. కవిష ఎగోడగే (30*: 54 బంతుల్లో), కుషి శర్మ (29: 50 బంతుల్లో) మరీ నెమ్మదిగా ఆడటంతో పరుగుల రాక ఇబ్బంది మారింది. యూఏఈ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సూ లేకపోవడం గమనార్హం. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 2, దయాలన్ హేమలత ఒక వికెట్‌ తీశారు.  హ్యాట్రిక్ విజయాలు సాధించడంతో సెమీస్‌కు చేరుకొనే అవకాశాలను టీమ్‌ఇండియా మరింత మెరుగుపర్చుకుంది. అంతకుముందు శ్రీలంక, మలేషియా జట్లను భారత్‌ చిత్తు చేసిన విషయం తెలిసిందే.

దుమ్మురేపిన రోడ్రిగ్స్, దీప్తి శర్మ

టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌కు శుభారంభమేమీ దక్కలేదు. తొలి ఓవర్‌లోనే రిచా ఘోష్‌ (0) డకౌట్‌గా పెవిలియన్‌కు చేరింది. అనంతరం మరో ఓపెనర్‌ సబ్బినేని మేఘన (10) కూడా త్వరగానే ఔటైయింది. మరో రెండు పరుగులకే దయాలన్‌ హేమలత (2) విఫలం కావడంతో 19 పరుగులకే టీమ్‌ఇండియా మూడు కీలక వికెట్లను చేజార్చుకొని కష్టాల్లో పడింది. అయితే దీప్తి శర్మ (64: 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి జెమీమా రోడ్రిగ్స్‌ (75 నాటౌట్: 45 బంతుల్లో 11 ఫోర్లు) భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 13.3 ఓవర్లలో 129 పరుగులు జోడించారు. చివర్లో పూజా వస్త్రాకర్‌ (13), కిరన్‌ నవ్‌గిరె (10) కూడా బ్యాట్‌ను ఝలిపించడంతో భారత్‌ 178 పరుగులు చేయగలిగింది. యూఏఈ బౌలర్లలో ఛాయా ముఘల్, మహికా గౌర్, ఈషా, సురక్ష తలో వికెట్‌ తీశారు. అక్టోబర్‌ ఏడో తేదీన (శుక్రవారం) భారత్‌ తదుపరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని