IND vs NZ: సిరీస్‌ ఖాతాలో పడాలంటే.. టాప్‌ ఆర్డర్‌ గాడిలో పడాల్సిందే!

భారత్, న్యూజిలాండ్‌ (IND vs NZ) మధ్య మూడో టీ20 బుధవారం జరగనుంది. సిరీస్‌ నిర్ణయాత్మక పోరులో టీమ్‌ఇండియాకు కివీస్‌ నుంచి కఠిన సవాలు ఎదురయ్యే అవకాశముంది. 

Published : 31 Jan 2023 19:19 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత సంవత్సరంలో వరుసగా మూడు సిరీస్‌లను గెలిచి భారత్‌ ఉత్సాహంగా ఉంది. అదే విధంగా నాలుగో సిరీస్‌ను ఖాతాలో వేసుకోవాలని ఆశిస్తున్న టీమ్‌ఇండియాకు.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లోనే కఠిన సవాల్‌ ఎదురై ఉంటుంది. హార్దిక్‌ నాయకత్వంలోని భారత్‌ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూడగా.. రెండో టీ20లో మాత్రం చివరి వరకు పోరాడి విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ రేసులో నిలిచింది. ఇక  సిరీస్‌ను తేల్చే చివరి మ్యాచ్ బుధవారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది. మరి ఇలాంటి కీలకమైన మ్యాచ్‌లో మెరుగు చేసుకోవాల్సిన అంశాలివే.. 

బ్యాటింగ్‌లో... 

వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన సమరోత్సాహంతో టీ20 సిరీస్‌ కోసం బరిలోకి దిగిన టీమ్‌ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి మ్యాచ్‌లో కీలకమైన బౌలర్లు విఫలం కాగా.. బ్యాటింగ్‌లోనూ టాప్ ఆర్డర్‌ నిరుత్సాహపరిచింది. ఇక రెండో మ్యాచ్‌కు వచ్చేసరికి బౌలింగ్‌లో అదరగొట్టేసిన టీమ్‌ఇండియా.. ఛేదనలో చెమటోడ్చాల్సి వచ్చింది. స్పిన్‌ బౌలింగ్‌కు పిచ్‌ అనుకూలంగా మారడంతో ఆచితూచి ఆడాల్సిన టాప్‌ ఆర్డర్‌ మళ్లీ తప్పటడుగులతో విఫలమైంది. సిరీస్‌ను తేల్చే మ్యాచ్‌లోనూ ఇలాంటి ప్రదర్శనే పునరావృతమైతే మాత్రం భారత్‌కు దెబ్బ తగలకమానదు. వచ్చిన అవకాశాలను శుభ్‌మన్‌ గిల్, ఇషాన్ కిషన్‌తోపాటు రాహుల్‌ త్రిపాఠి సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఇదే కొనసాగితే రిజర్వ్‌ బెంచ్‌ మీద ఆటగాళ్లు తమ ఛాన్స్‌ కోసం డిమాండ్‌ చేసేందుకు వీలు కలుగుతుంది. 

స్పిన్‌ ఓకే కానీ.. 

సిరీస్‌లోని రెండు మ్యాచుల్లో స్పిన్నర్లు రాణించారు. మరీ ముఖ్యంగా లఖ్‌నవూ పిచ్‌పై అయితే విజృంభించారు. కానీ, స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లోనూ పేసర్ శివమ్‌ మావి విఫలం కావడం, అలాగే తొలి మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ భారీగా పరుగులు సమర్పించడం భారత శిబిరంలో ఆందోళనకు గురి చేసే అంశం. ఫాస్ట్‌ బౌలర్లు రాణిస్తే టీమ్‌ఇండియాకు తిరుగుండదు. కెప్టెన్ హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో నిలకడ లోపించింది. పేస్ బౌలింగ్‌ను సరిగ్గా సంధిస్తేనే ఫలితం అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లు ఎంత కష్టపడినా.. ఫాస్ట్‌ బౌలర్లు ప్రభావం చూపకపోతే సిరీస్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది.  

కెప్టెన్‌ నిర్ణయాలే కీలకం.. 

కెప్టెన్‌ హార్దిక్‌ బౌలింగ్‌ దాడిని తనతోనే ప్రారంభించి.. మిగతా బౌలర్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించడం అభినందనీయమే. కానీ, బౌలర్లను వినియోగించే తీరు సరిగా ఉండటం లేదనేది మాజీల అభిప్రాయం. ఉదాహరణకు రెండో టీ20 మ్యాచ్‌నే పరిశీలిస్తే.. అద్భుతంగా వేస్తున్న చాహల్‌ను కాదని దీపక్ హుడాతో పూర్తి ఓవర్ల కోటాను వేయించడంపై గౌతమ్‌ గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. లఖ్‌నవూ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉందని తెలుసు.. అలాంటప్పుడు స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ అయిన చాహల్‌కు కేవలం రెండు ఓవర్లను మాత్రమే వేయించాడు. దీపక్ హుడాకు నాలుగు ఓవర్లు ఇచ్చాడు. ‘మిషన్ -2024’ కోసం ఇదంతా ప్రణాళిక బాగానే ఉంటుంది కానీ.. రెగ్యులర్ స్పిన్నర్‌ ఉన్నప్పుడు అతడినే వినియోగించుకొంటే బాగుంటుందనేది సీనియర్ల సూచన. ఒకవేళ బౌలింగ్‌లో విఫలమైనప్పుడు బంతిని ఇవ్వకపోవడం ఎవరికీ అభ్యంతరం ఉండదు. కీలకమైన మ్యాచ్‌లోనైనా బ్యాటింగ్‌, బౌలింగ్‌ వనరులను సద్వినియోగం చేసుకోని సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని