టీమ్‌ఇండియా ద్వితీయ శ్రేణి జట్టు కాదు

శ్రీలంకలో పర్యటిస్తున్న శిఖర్‌ధావన్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా దితీయశ్రేణి జట్టు కాదని ఆ దేశ క్రికెట్‌ బోర్డు స్పష్టంచేసింది. ఈనెలలో శ్రీలంక జట్టు టీమ్‌ఇండియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే...

Published : 03 Jul 2021 01:15 IST

అర్జున రణతుంగా మాటలను ఖండించిన లంక బోర్డు..

(Photo: BCCI Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకలో పర్యటిస్తున్న శిఖర్‌ధావన్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా ద్వితీయ శ్రేణి జట్టు కాదని ఆ దేశ క్రికెట్‌ బోర్డు స్పష్టంచేసింది. ఈనెలలో శ్రీలంక జట్టు టీమ్‌ఇండియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ అర్జున రణతుంగా తాజాగా మీడియాతో మాట్లాడుతూ భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు అంగీకరించినందుకు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అది శ్రీలంక క్రికెట్‌కే అవమానకరమని వ్యాఖ్యానించాడు.

‘ఇది టీమ్‌ఇండియా ద్వితీయ శ్రేణి జట్టు. వాళ్లు ఇక్కడికి వచ్చి ఆడటం మన క్రికెట్‌కే అవమానం. కొన్ని అవసరమైన పరిస్థితుల నేపథ్యంలో ఆ జట్టుతో ఆడటానికి అంగీకరించిన పాలక మండలిదే తప్పంతా. భారత్‌ తమ మేటి ఆటగాళ్లను ఇంగ్లాండ్‌కు తరలించి, ఇతరులను ఇక్కడికి పంపించింది. అందుకోసమే నేను లంక బోర్డును నిందిస్తున్నా’ అని రణతుంగా అన్నాడు. 

దీనిపై స్పందించిన లంక బోర్డు అక్కడికి వచ్చిన టీమ్‌ఇండియా ద్వితీయ శ్రేణి జట్టు కాదని ఓ ప్రకటనలో తేల్చిచెప్పింది. అక్కడికి వచ్చిన 20 మంది ఆటగాళ్లలో 14 మంది టీమ్‌ఇండియా తరఫున ఏదో ఒక ఫార్మాట్‌లో ఆడారని, రణతుంగా ఆరోపించినట్లు అది ద్వితీయ శ్రేణి జట్టు కాదని వివరించింది. ప్రస్తుతం కొలంబోలో ఉన్న టీమ్‌ఇండియా గురువారమే మూడు రోజుల కఠిన క్వారంటైన్‌ గడువు పూర్తిచేసుకుంది. దాంతో రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షణలో శుక్రవారం నుంచి ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని