NZ vs IND: వరుణుడు ఆగాలి.. బౌలింగ్‌ మెరుగుపడాలి.. సిరీస్‌ సమం చేయాలి

భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో బుధవారమే చివరి మ్యాచ్‌. ఇందులో టీమ్ఇండియా గెలిస్తే సిరీస్‌ సమమవుతుంది. ఒకవేళ కివీస్‌ విజయం సాధిస్తే మాత్రం సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. 

Published : 29 Nov 2022 20:53 IST

ఇంటర్నెట్ డెస్క్: మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ విజయం సాధించడంలో ఆటగాళ్లు కష్టమెంత ఉందో.. వరుణుడి సహకారం కూడా ఉంది. ఇప్పుడు అదే వర్షం వన్డే సిరీస్‌కు అడ్డు పడకుండా ఉండాలని టీమ్‌ఇండియా బలంగా కోరుకుంటోంది. ఎందుకంటే మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పుడు కివీస్‌ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో వన్డే వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. ఇక కీలకమైన చివరి వన్డే బుధవారం జరగనుంది. ఇందులో గెలిచినా.. వర్షం వచ్చి రద్దు అయినా సిరీస్‌ న్యూజిలాండ్‌ సొంతమవుతుంది. అందుకే చివరి మ్యాచ్‌ జరగాలని.. అందులో భారత్‌ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే క్రైస్ట్‌చర్చ్‌లో వర్షం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఆటకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

బ్యాటింగ్‌ ఫర్వాలేదు.. బౌలింగ్‌ ఇంకాస్త..

తొలి వన్డేలో భారత్‌ బ్యాటింగ్‌ అనుకొన్నట్లుగానే సాగింది. పిచ్‌ బౌలింగ్‌కు సహకరిస్తున్న వేళ ఓపెనర్లు ఎంతో నిలకడగా ఆడి పరుగులు రాబట్టారు. కివీస్‌ ఎదుట 307 పరుగులను లక్ష్యంగా ఉంచింది. అయితే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ మిడిలార్డర్‌ను అడ్డుకోవడంలో భారత బౌలర్లు విఫలం కావడం కలవరపెట్టింది. ఉమ్రాన్‌ మాలిక్‌, వాషింగ్టన్ సుందర్ మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. ఆరంభ ఓవర్లలో అద్భుతంగా వేసిన శార్దూల్ ఠాకూర్ కీలకమైన సమయంలో భారీగా పరుగులు సమర్పించాడు. కేన్ విలియమ్సన్ (94*), టామ్‌ లాథమ్ (145*) నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 221 పరుగులను జోడించారు. వీరిని ఔట్ చేయలేక ఇబ్బంది పడ్డారు. చివరి వన్డేలోనూ ఇలాంటి ప్రదర్శనే పునరావృతమైతే సిరీస్‌ పోవడం ఖాయం. అలాగే వన్డే ప్రపంచకప్‌ సూపర్ లీగ్‌ పాయింట్ల టేబుల్‌లో ర్యాంక్‌ కూడా పడిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని