Ravi Shastri: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు నా ఎంపిక ఇలా..: రవిశాస్త్రి

డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో తుదిజట్టు ఎంపిక భారత్‌కు కత్తిమీద సాములా మారనుంది. ముఖ్యంగా పంత్‌ గైర్హాజరీతో కీపర్‌ ఎంపిక రోహిత్‌కు సవాలుగా  మారనుంది. ఈ నేపథ్యంలో మాజీ కోచ్‌ రవిశాస్త్రి మాట్లాడూతూ కీపర్‌ ఎంపికపై తన అభిప్రాయం వెల్లడించాడు. 

Updated : 02 Jun 2023 11:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌-2023 సంబరాలు ముగిశాయి. ఇక భారత క్రికెట్‌ అభిమానులు మొత్తం జూన్‌ 7వ తేదీ నుంచి మొదలుకానున్న ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ (The World Test Championship) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత జట్టులో ప్రధాన ఆటగాళ్లైన సీమర్‌ జస్ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah ), కీపర్‌ రిషబ్‌ పంత్‌(Rishabh Pant) గాయాల కారణంగా ఇప్పటికే దూరమయ్యారు. ఈ నేపథ్యంలో భారత్‌కు కీపర్‌ ఎంపిక సవాలుగా మారనుంది. దీనిపై మాజీ కోచ్‌ రవిశాస్త్రి స్పందించాడు. తానైతే జట్టులో 12 మంది ఆటగాళ్లను ఏ విధంగా ఎంపిక చేసేవాడో వివరించాడు.

జట్టు ఎంపికపై రవిశాస్త్రి (Ravi Shastri) మాట్లాడుతూ.. ‘‘మీరు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ విషయం గురించి చూస్తే.. గతంలో ఫైనల్స్‌కు చేరినప్పుడు మ్యాచ్‌ నుంచి మీరు ఏమి నేర్చుకొన్నారనేది చాలా కీలకం. పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్ల ఎంపిక ఉండాలి. గతంలో సౌథాంప్టన్‌లో వాతావరణం మేఘావృతమై ఉంది. అందుకే.. నా 12 మంది ఎంపిక చాలా స్పష్టంగా ఉంటుంది. రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌, 3వ ఆటగాడిగా ఛతేశ్వర్‌ పుజార, 4 నంబర్‌లో విరాట్‌, 5వ నంబర్‌లో రహానే ఉంటారు. ఇక కేఎస్‌ భరత్‌, ఇషాన్‌ కిషన్‌ మధ్య ఎంపిక కీలకం. ఎవరు ఆడుతున్నారనే దాని ఆధారంగా ఎంపిక ఉండాలి. ఇద్దరు స్పిన్నర్లుంటే భరత్‌ను ఎంపిక చేస్తాను. అదే నలుగురు సీమర్లు ఒక స్పిన్నర్‌ ఉంటే ఇషన్‌ కిషన్‌ వైపు మొగ్గుతాను. ఇక 6లో జడేజా, 7లో షమీ, 8లో సిరాజ్‌, 9లో శార్దూల్‌, 11లో అశ్విన్‌, 12వ ఆటగాడిగా ఉమేష్‌ యాదవ్‌ను ఎంపిక చేస్తాను’’ అని వివరించాడు.

2013 నుంచి ఐసీసీ ట్రోపీ భారత్‌ను ఊరిస్తోంది. రోహిత్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా ఈ సారి ఎలాగైనా డబ్ల్యూటీసీ టైటిల్‌ను అందుకోవాలనే పట్టుదలతో ఉంది. 2021-23 డబ్ల్యూటీసీ చక్రంలోనూ భారత్‌ ఆధిపత్యం చలాయించినా కొంత తడబాటు తప్పలేదు. ఒడుదొడుకులు దాటి 18 మ్యాచ్‌ల్లో 10 విజయాలు, 3 డ్రాలతో పట్టికలో రెండో స్థానంతో తుదిపోరుకు అర్హత సాధించింది. కానీ ఈ సారి బ్యాటింగ్‌లో నిలకడగా రాణించిన ఆటగాళ్లు లేరు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న వనరులతో అత్యుత్తమ కూర్పును బరిలో దించి ఉత్తమ ఫలితాలు సాధించాలని రోహిత్‌ భావిస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని