Team India: కివీస్‌తో మరో వన్డే ఓడితే.. సిరీస్‌తోపాటు భారత్‌ అగ్రస్థానానికి ఎసరు..!

ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే వన్డే మ్యాచ్‌ సిరీస్‌ ఫలితంతోపాటు ఐసీసీ వన్డే సూపర్‌ లీగ్‌ పాయింట్లపైనా ప్రభావం చూపనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే సిరీస్‌ రేసులో నిలబడుతుంది. ఒక వేళ ఓడితే మాత్రం సిరీస్‌తోపాటు సూపర్‌ లీగ్‌లో రెండో స్థానానికి పడిపోవడం ఖాయం.

Published : 26 Nov 2022 11:46 IST

ఇంటర్నెట్ డెస్క్: తొలి వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో టీమ్‌ఇండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. 300కిపైగా పరుగులు సాధించినా కాపాడుకోవడంలో బౌలర్లు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. అయితే తొలి వన్డేలో పరాజయం పాలైనప్పటికీ ఐసీసీ వరల్డ్‌ కప్‌ సూపర్ లీగ్‌ పాయింట్ల టేబుల్‌లో భారత్‌ స్థానం మాత్రం మారలేదు. అగ్రస్థానంతో కొనసాగుతోంది. అయితే శిఖర్ ధావన్‌ నాయకత్వంలోని భారత్‌ ఆదివారం కివీస్‌తో రెండో వన్డేలో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో మళ్లీ న్యూజిలాండ్‌ విజయం సాధిస్తే మాత్రం టీమ్‌ఇండియా రెండో స్థానానికి పడిపోవడం ఖాయం. అలాగే సిరీస్‌ కూడా కివీస్‌ సొంతమవుతుంది.

ప్రస్తుతం భారత్‌ 19 మ్యాచుల్లో 13 విజయాలు, 6 ఓటములతో 129 పాయింట్లు సాధించింది. ఐసీసీ రూల్స్‌ ప్రకారం ఒక్క విజయానికి పదేసి పాయింట్లు వస్తాయి. ఈ లెక్కన టీమ్‌ఇండియా ఖాతాలో 130 పాయింట్లకు బదులు 129 మాత్రమే ఉండటానికి కారణం పెనాల్టీ ఓవర్‌. ఎన్ని పెనాల్టీ ఓవర్లు వేస్తే అన్ని పాయింట్లు కోత పడతాయి. అలాగే మ్యాచ్‌ రద్దు అయితే ఇరు జట్లకూ చెరో ఐదేసి పాయింట్లు వస్తాయి. ఈ క్రమంలో భారత్‌కు ఒక పెనాల్టీ ఓవర్‌ ఉండటంతో ఒక పాయింట్‌ తగ్గింది. మరోవైపు న్యూజిలాండ్ 16 మ్యాచుల్లో 12 విజయాలు, నాలుగు ఓటములతో 120 పాయింట్లతో ఉంది. ఒక వేళ రెండో వన్డేలో కివీస్‌ విజయం సాధిస్తే.. అప్పుడు 130 పాయింట్లకు వెళ్లిపోతుంది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న భారత్‌ రెండో స్థానానికి పడిపోతుంది. 

ఐసీసీ పాయింట్ల పట్టికలో టాప్‌ - 8 జట్లు భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన ఐదు జట్లు క్వాలిఫయిర్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈసారి 13 జట్లు బరిలోకి దిగబోతున్నాయి. అయితే భారత్‌ పాయింట్లపరంగా అర్హత సాధించకపోయినా.. ఆతిథ్య జట్టు హోదాలో ఆడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత్, కివీస్‌ కాకుండా.. ఇంగ్లాండ్‌ (125 పాయింట్లు), ఆస్ట్రేలియా (120), బంగ్లాదేశ్‌ (120), పాకిస్థాన్ (120), అఫ్గానిస్థాన్‌ (110), వెస్టిండీస్ (88) టాప్‌-8లో కొనసాగుతున్నాయి. 

* ఐర్లాండ్‌ (68), శ్రీలంక (62), దక్షిణాఫ్రికా (59), జింబాబ్వే (45), నెదర్లాండ్స్ (25)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని