IND vs AUS: మొదటి రోజు ఆట పూర్తి.. శతకం బాదిన ఖవాజా

భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి రోజు ఆట పూర్తయింది.

Updated : 09 Mar 2023 17:01 IST

అహ్మదాబాద్‌: భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి రోజు ఆట పూర్తయింది. ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖవాజా (104*; 251 బంతుల్లో 15 ఫోర్లు) శతకం బాదాడు. కామెరూన్‌ గ్రీన్‌ (49*; 64 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్‌ సెంచరీకి ఒక పరుగు దూరంలో నిలిచాడు. ట్రావిస్ హెడ్ (32; 44 బంతుల్లో 7 ఫోర్లు), లబుషేన్‌ (3), హ్యాండ్స్‌కాంబ్ (17; 27 బంతుల్లో 3 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (38; 135 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహమ్మద్‌ షమి రెండు వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. 

ఆరంభంలో ఆచితూచి ఆడి తర్వాత దూకుడు పెంచిన ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ అశ్విన్‌ వెనక్కి పంపాడు. హెడ్‌ జడేజాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. కొద్దిసేపటికే లబుషేన్‌ (3)ను షమీ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఆఫ్‌సైడ్‌ వేసిన బంతిని ఆడిన లబుషేన్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకోవడంతో బౌల్డయ్యాడు. లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఆసీస్‌ రెండు వికెట్ల నష్టానికి 29 ఓవర్లలో 75 పరుగులు చేసింది. రెండో సెషన్‌లో ఆసీస్‌ బ్యాటర్లు నెమ్మదిగా ఆడి భారత బౌలర్లను పరీక్షించారు. వికెట్ పడకుండానే ఆ సెషన్‌ ముగిసింది. ఈ సెషన్‌లో ఆసీస్‌ 74 పరుగులు చేసింది. 

దాదాపు 40 ఓవర్ల తర్వాత ఆసీస్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. టీ విరామం తర్వాత  స్టీవ్‌ స్మిత్‌ను రవీంద్ర జడేజా ఔట్‌ చేశాడు. దీంతో ఉస్మాన్‌ ఖవాజాతో కలిసి మూడో వికెట్‌కు నిర్మించిన 79 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్టీవ్‌ స్మిత్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పీటర్ హ్యాండ్స్‌కాంబ్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే షమీ వేసిన (70.4వ ఓవర్‌) బంతికి క్లీన్‌బౌల్డ్‌ అయి పెవిలియన్‌కు చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన గ్రీన్‌ దూకుడుగా ఆడగా.. ఖవాజా నెమ్మదిగా ఆడాడు. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన 82 ఓవర్‌, షమీ వేసిన 85 ఓవర్‌లో గ్రీన్‌ రెండేసి బౌండరీలు బాదాడు. షమీ వేసిన మొదటి రోజు ఆఖరి ఓవర్‌లో తొలి బంతికి బౌండరీ బాది ఖవాజా శతకం పూర్తి చేసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని