చెపాక్‌లో ‘రూట్‌’ వేశాడు!

చెపాక్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఇంగ్లాండ్‌దే పైచేయి. సారథి జో రూట్ (128*; 197 బంతుల్లో, 14×4, 1×6) తన...

Updated : 05 Feb 2021 17:28 IST

తొలి రోజు ఇంగ్లాండ్‌దే పైచేయి

ఇంటర్నెట్‌డెస్క్‌: చెపాక్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఇంగ్లాండ్‌ పైచేయి సాధించింది. సారథి జో రూట్ (128*; 197 బంతుల్లో, 14×4, 1×6) తన సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తూ శతకంతో సత్తాచాటాడు. ఓపెనర్‌ సిబ్లీ (87; 286 బంతుల్లో, 12×4) కూడా రాణించడంతో తొలి రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 263/3 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. బుమ్రా రెండు వికెట్లు, అశ్విన్‌ ఒక్క వికెట్‌ పడగొట్టారు. ఆఖరి ఓవర్‌లో టీమిండియా మూడో వికెట్‌ సాధించింది.

65 పరుగులకే రెండు వికెట్లు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్‌కు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు బర్న్స్‌ (33; 60 బంతుల్లో, 2×4), సిబ్లీ మొదటి వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ రవిచంద్రన్ అశ్విన్‌ బర్న్స్‌ను బోల్తాకొట్టించడంతో 63 పరుగుల వద్ద పర్యాటక జట్టు తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన లారెన్స్‌ను బుమ్రా ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో ఇంగ్లాండ్‌ 63 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

తొలుత నిదానంగా.. తర్వాత దూకుడుగా

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రూట్‌.. సిబ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలుత వీరిద్దరు వికెట్‌ కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. అందివచ్చినప్పుడల్లా బౌండరీలు బాదారు. సిబ్లీ అర్ధశతకం సాధించడంతో టీ విరామానికి ఇంగ్లాండ్‌ 140/2తో నిలిచింది. అనంతరం రూట్ గేర్‌ మార్చాడు. బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. స్వీప్‌షాట్లతో పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో శతకం అందుకున్నాడు. తన కెరీర్‌లో రూట్‌కు ఇది 100వ టెస్టు.

మరోవైపు రూట్‌కు సిబ్లీ చక్కని సహకారం అందించాడు. డిఫెండ్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ పరుగులు సాధించాడు. రూట్‌తో కలిసి మూడో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే తొలి రోజు ఆటలో భారత్‌కు రెండే వికెట్లు దక్కాయని అందరూ భావిస్తున్న తరుణంలో బుమ్రా మాయ చేశాడు. ఆఖరి ఓవర్‌లో బంతిని అందుకున్న అతడు అద్భుతమైన యార్కర్‌తో సిబ్లీని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. సిబ్లీ రివ్యూకు వెళ్లినా ఔట్ అనే తేలింది. దీంతో ఇంగ్లాండ్‌ తొలి రోజు ఆటలో 89.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. టెస్టుపై భారత్‌ పట్టుబిగించాలంటే రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్‌ను వీలైనంత తక్కువ స్కోరుకు కట్డడి చేయాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి

సచిన్‌, ఆర్పీ, శ్రీనాథ్‌ కన్నా బుమ్రానే ఎక్కువ

1994 తర్వాత చెన్నై టెస్టులోనే ఇలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని