INDvsNZ: కివీస్‌ను తక్కువ అంచనా వేయొద్దు.. 

భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు మరో ఐదు రోజుల్లో ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పోటీపడుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఈ సుదీర్ఘ టోర్నీలో భారత్‌.. కివీస్‌తో మినహా అన్ని జట్లపైనా విజయం సాధించి సగర్వంగా తుదిపోరుకు సిద్ధమైంది...

Updated : 13 Jun 2021 13:44 IST

ఐసీసీ ట్రోఫీల్లో భారత్‌కు షాకిచ్చిన న్యూజిలాండ్‌

భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు మరో ఐదు రోజుల్లో ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పోటీపడుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఈ సుదీర్ఘ టోర్నీలో భారత్‌.. కివీస్‌ మినహా అన్ని జట్లపైనా విజయం సాధించి సగర్వంగా తుదిపోరుకు సిద్ధమైంది. అయితే, ఇప్పుడు అదే జట్టుతో మళ్లీ తలపడాల్సి రావడంతో కోహ్లీసేన ఈసారి ఎలా ఆడనుందనే విషయం ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌ పలుమార్లు భారత్‌కు షాకివ్వడం కూడా ఇప్పుడు కొత్తగా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా ఎప్పుడెప్పుడు ఆ జట్టుతో ఓటమిపాలైందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


దాదా శతకం వృథా..

2000 ఏడాది ఐసీసీ నాకౌట్‌ సిరీస్‌లో టీమ్‌ఇండియాకు న్యూజిలాండ్‌ తొలిసారి షాకిచ్చింది. సౌరభ్‌ గంగూలీ నేతృత్వంలోని జట్టును స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ టీమ్‌ ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన గంగూలీ (117; 130 బంతుల్లో 9x4, 4x6), సచిన్‌ (69; 83 బంతుల్లో 10x4, 1x6) కివీస్‌ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. వీరిద్దరూ తొలివికెట్‌కు 26.3 ఓవర్లలో 141 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అదే సమయంలో సచిన్‌ వెనుదిరగ్గా ఆపై వచ్చిన రాహుల్‌ ద్రవిడ్ ‌(22), యువరాజ్‌ సింగ్ ‌(18), వినోద్‌ కాంబ్లీ (1), రాబిన్‌సింగ్ ‌(13), అజిత్‌ అగార్కర్‌ (15) పెద్దగా పరుగులు చేయలేకపోయారు. దాంతో చివరికి టీమ్‌ఇండియా 50 ఓవర్లలో 264/6తో సరిపెట్టుకుంది. ఛేదనలో కివీస్‌ 49.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. క్రిస్‌కేర్న్స్ ‌(102*; 113 బంతుల్లో 8x4, 2x6) శతకంతో చెలరేగాడు. అతడికి క్రిస్‌ హారిస్ ‌(46; 72 బంతుల్లో 4x4) చక్కటి సహకారం అందించాడు. దాంతో న్యూజిలాండ్‌ రెండు బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.


లక్ష్యం 127 కానీ..79కే ఆలౌట్‌..

ఇక 2016 టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు గ్రూప్‌-2లో పదమూడో మ్యాచ్‌లో తలపడ్డాయి. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేన్‌ విలియమ్సన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 126/7 స్వల్ప స్కోరుకే పరిమితమైంది. దాంతో భారత్‌ సునాయాస విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ధోనీసేన ఛేదనలో మరింత దారుణంగా ఆడి టీ20ల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత బౌలర్లు అశ్విన్‌, నెహ్రా, బుమ్రా, రైనా, జడేజా కట్టుదిట్టంగా బంతులేసి తలా ఓ వికెట్‌ తీసి కివీస్‌ను భారీ స్కోర్‌ చేయకుండా నిలువరించారు. ఆ జట్టులో కొరే అండర్సన్‌ (34; 42 బంతుల్లో 3x4), లూక్‌ రోంచి (21; 11 బంతుల్లో 2x4, 1x6) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్‌ పూర్తిగా విఫలమైంది. కోహ్లీ (23; 27 బంతుల్లో 2x4), ధోనీ (30; 30 బంతుల్లో 1x4, 1x6) మినహా ఎవరూ రాణించలేదు. దాంతో చివరికి 18.1 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. మిచెల్‌ శాంట్నర్‌ 4/11 కెరీర్‌లో గొప్ప గణాంకాలు నమోదు చేశాడు.


ధోనీ రనౌటై.. నిరాశపర్చాడు..

2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు మరోసారి తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులే చేసింది. రాస్‌టేలర్‌ (74; 90 బంతుల్లో 3x4, 1x6), కేన్‌ విలియమ్సన్‌ (67; 95 బంతుల్లో 6x4) నిలకడగా ఆడి జట్టుకు పోరాడే స్కోర్‌ అందించారు. కానీ, ఆరోజు వర్షం కురవడంతో ఆట మరుసటి రోజుకు వాయిదా పడింది. ఛేదనలో భారత టాప్‌ ఆర్డర్‌ పూర్తిగా చేతులేత్తేసింది. కేఎల్‌ రాహుల్ ‌(1), రోహిత్‌ శర్మ (1), కోహ్లీ (1) దినేశ్‌ కార్తీక్ ‌(6) విఫలమయ్యారు. మధ్యలో పంత్ (32), హార్దిక్‌ పాండ్య (32) ఫర్వాలేదనిపించినా భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 92 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. కానీ, రవీంద్ర జడేజా (77; 59 బంతుల్లో 4x4, 4x6), ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1x6) అద్భుతంగా ఆడి మ్యాచ్‌పై ఆశలు రేకెత్తించారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే చివర్లో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోగా స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔటయ్యారు. ముఖ్యంగా ధోనీ అర్ధశతకం పూర్తయ్యాక రనౌట్ అవ్వడంతో భారత్‌ ఓటమి ఖాయమైంది.


రెండు టెస్టుల్లో ఓటమే..

మరోవైపు గతేడాది న్యూజిలాండ్‌ పర్యటనలోనూ టీమ్‌ఇండియా ఈ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో విలియమ్సన్‌ జట్టుతో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయించిన భారత్‌.. కివీస్‌తో మాత్రం గెలవలేకపోయింది. తొలి టెస్టులో న్యూజిలాండ్‌ 10 వికెట్ల తేడాతో గెలుపొందగా రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌ ఎప్పుడూ భారత్‌కు చేదు అనుభవమే మిగిలిస్తోంది. ఇప్పుడు ఫైనల్‌ మ్యాచ్‌ ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో తటస్థ వేదికగా జరుగుతుండడంతో మ్యాచ్‌పై ఆసక్తి పెరుగుతోంది. కానీ, ఆ ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌.. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడటం వల్ల ఆ జట్టుకు కలిసివస్తుందని పలువురు క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీసేన ఎలా ఆడనుందో వేచిచూడాలి.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని