Ind vs SL: భారత్‌, శ్రీలంక తొలి టీ20.. హార్దిక్‌ పాండ్య గాయంపై అప్‌డేట్

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఫీల్డింగ్‌, బౌలింగ్‌ చేస్తున్న సమయంలో భారత కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య వెన్ను నొప్పితో కాస్త ఇబ్బందికి గురయ్యాడు. మ్యాచ్‌ అనంతరం తన గాయంపై హార్దిక్‌ స్పష్టతనిచ్చాడు.  

Published : 04 Jan 2023 10:43 IST

ఇంటర్నెట్ డెస్క్: మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి టీ20లో భారత్‌ చివరి వరకు పోరాడి విజయం సాధించింది. ఆఖరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన స్థితిలో.. జోరుమీదున్న చమికకు షాట్‌ ఆడే అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన బంతిని వేసి జట్టును గట్టెక్కించాడు అక్షర్‌పటేల్‌. శ్రీలంక ఇన్నింగ్స్‌లో హార్దిక్‌ తన మూడో ఓవర్ (ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌) వేస్తున్నప్పుడు వెన్ను నొప్పితో అసౌకర్యానికి గురై బౌలింగ్‌ చేయడానికి ఇబ్బందిపడ్డాడు. దీంతో అతడికి ఏమైందని టీమ్‌ఇండియా శిబిరంతోపాటు అభిమానులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. ఇది జరిగిన తర్వాత పాండ్య మరో ఓవర్‌ వేయలేదు. కానీ, ఫీల్డింగ్‌ చేశాడు. శివమ్‌ మావి వేసిన 15వ ఓవర్లో హసరంగ క్యాచ్‌ను అందుకున్న తర్వాత హార్దిక్‌.. కాలు కండరాల నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే మైదానాన్ని వీడాడు. కొద్ది సేపటి అనంతరం మళ్లీ గ్రౌండ్‌లోకి వచ్చాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం తన  గాయం గురించి హార్దిక్‌ మాట్లాడాడు.  

‘నా గాయం గురించి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కానీ, నేను బాగానే ఉన్నాను. నేను సరిగ్గా నిద్రపోలేదు. తగినంత నీరు తాగలేదు. అందువల్ల కండరాలు పట్టేశాయి’అని పేర్కొన్నాడు. జట్టులోని యువ ఆటగాళ్లు  బాగా ఆడారని, ముఖ్యంగా అరంగేట్ర బౌలర్‌ శివమ్ మావి అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని హార్దిక్ ప్రశంసించాడు. ఆటగాళ్లు తమపై తాము నమ్మకం ఉంచుకోవాని, వైఫల్యాలను చూసి భయపడకూడదని సూచించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని