INDvsSL: లంకపై పరుగుల పంట.. 

భారత్‌, శ్రీలంక జట్ల మధ్య ఇప్పటివరకు ఎన్నో వన్డే మ్యాచ్‌లు జరిగాయి. అందులో 32 సార్లు ఇరు జట్లూ 300 పరుగులకు పైగా స్కోర్లు నమోదు చేశాయి. వచ్చేవారం రెండు జట్ల మధ్య మరో వన్డే సిరీస్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో...

Published : 10 Jul 2021 09:30 IST

టీమ్‌ఇండియాదే ఆధిపత్యం..

భారత్‌, శ్రీలంక జట్ల మధ్య ఇప్పటివరకూ ఎన్నో వన్డే మ్యాచ్‌లు జరిగాయి. అందులో 32 సార్లు ఇరు జట్లూ 300 పరుగులకు పైగా స్కోర్లు నమోదు చేశాయి. వచ్చేవారం రెండు జట్ల మధ్య మరో వన్డే సిరీస్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకూ వాటి మధ్య నమోదైన టాప్-5 అత్యధిక పరుగుల మ్యాచ్‌ల విశేషాలను తెలుసుకుందాం. కాగా, ఇక్కడ రోహిత్‌ శర్మ పరుగుల పంట పండించడం విశేషం. ఈసారి అతడు ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్నందున ఆ బాధ్యత ఎవరు మోస్తారో చూడాలి.


సెహ్వాగ్‌, సచిన్‌ @ 153..

ఇరుజట్ల మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక స్కోర్‌ సాధించింది భారత జట్టే. అది 2009 డిసెంబర్‌ 15న రాజ్‌కోట్‌ వేదికగా తలపడిన సందర్భంగా నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 414/7 భారీ స్కోర్‌ సాధించింది. నాటి ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్‌ (146; 102 బంతుల్లో 17x4, 6x6), సచిన్‌ తెందూల్కర్‌ (69; 63 బంతుల్లో 10x4, 1x6) విరోచితంగా ఆడి శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 153 పరుగులు జోడించారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (72; 53 బంతుల్లో 7x4, 3x6) మరో విలువైన ఇన్నింగ్స్‌ ఆడడంతో భారత్‌ తన వన్డే చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్‌ సాధించింది.


వణుకు పుట్టించిన దిల్షాన్‌, సంగక్కర..

భారత్‌ నిర్దేశించిన 415 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక మ్యాచ్‌ను గెలిచినంత పనిచేసింది. ఈ జట్టులోనూ ఓపెనర్లు ఉపుల్‌ తరంగా (67; 60 బంతుల్లో 3x4, 4x6), తిలకరత్నె దిల్షాన్‌ (160; 124 బంతుల్లో 20x4, 3x6) దంచికొట్టారు. ఆపై వన్‌డౌన్‌లో వచ్చిన కుమార సంగక్కర (90; 43 బంతుల్లో 10x4, 5x6) సైతం అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. దాంతో ఆ జట్టు 37 ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసి మ్యాచ్‌పై పట్టు బిగించింది. తర్వాత భారత బౌలర్లు తిరిగి లయ అందుకొని స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు తీసి లంకపై ఒత్తిడి తెచ్చారు. అయితే, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ తిలిన కన్‌దాంబి (24), ఏంజిలో మాథ్యుస్‌ (38) రాణించి భారత్‌ను కంగారు పెట్టించారు. వాళ్లిద్దరూ చివర్లో ఔటవ్వడంతో లంక 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. దాంతో భారత్‌ 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. కాగా, ఇరు జట్లకూ ఇవే అత్యుత్తమ స్కోర్లు కావడం గమనార్హం.


రోహిత్‌, కోహ్లీ @ 202..

ఇక భారత్‌ రెండోసారి శ్రీలంకపై చెలరేగింది 2014 నవంబర్‌ 13న కోల్‌కతా వేదికగా జరిగిన ఈడెన్‌గార్డెన్స్‌ వన్డేలో. ఈసారి స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ (264; 173 బంతుల్లో 33x4, 9x6), విరాట్‌ కోహ్లీ (66; 64 బంతుల్లో 6x4) విరుచుకుపడ్డారు. హిట్‌మ్యాన్‌ వన్డే క్రికెట్‌లో ఎవరూ ఊహించని విధంగా బ్యాటింగ్‌ చేసి అత్యధిక వ్యక్తిగత స్కోర్‌తో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 202 పరుగులు జోడించాడు. అతడు చివరి బంతివరకూ క్రీజులో నిలిచి జట్టు స్కోరును 404/5కు చేరవేశాడు. అనంతరం శ్రీలంక ఛేదనలో 251 పరుగులకే ఆలౌటైంది. ఏంజిలో మాథ్యూస్‌ (75; 68 బంతుల్లో 9x4, 1x6), లాహిరు తిరుమానె (59; 69 బంతుల్లో 7x4, 1x6) అర్ధశతకాలతో రాణించినా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. దాంతో భారత్‌ 153 పరుగుల భారీ తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది.


హిట్‌మ్యాన్‌ ‘డబుల్‌’ హిట్‌..

టీమ్‌ఇండియా మూడోసారి లంకపై అత్యధిక స్కోర్‌ నమోదు చేయడంలోనూ హిట్‌మ్యాన్‌దే పాత్ర కీలక పాత్ర. అతడు రెండోసారి ఆ జట్టుపై వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు. 2017 డిసెంబర్‌ 13న మొహాలి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్‌ (208 నాటౌట్‌; 153 బంతుల్లో 13x4, 12x6) బ్యాట్‌ ఝుళిపించాడు. అతడికి ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ ‌(68; 67 బంతుల్లో 9x4), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (88; 70 బంతుల్లో 9x4, 2x6) సహకరించారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. ఆపై శ్రీలంక 251/8 పరుగులకు పరిమితమైంది. ఏంజిలో మాథ్యూస్‌ (111; 132 బంతుల్లో 9x4, 3x6) శతకంతో మెరిసినా ఇతర బ్యాట్స్‌మెన్‌ కనీస పోరాటపటిమ చూపించలేదు. దాంతో భారత్‌ 141 పరుగుల తేడాతో మరో భారీ గెలుపు రుచిచూసింది.


విజృంభించిన రోహిత్‌, కోహ్లీ..

శ్రీలంకపై భారత్‌ మరోసారి సాధించిన అత్యధిక స్కోర్‌ 375/5. ఈ మ్యాచ్‌ 2017 ఆగస్టు 31న కొలంబోలో జరిగింది. టీమ్ఇండియా తొలుత బ్యాటింగ్‌ చేయగా రోహిత్‌ శర్మ (104; 88 బంతుల్లో 11x4, 3x6), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (131; 96 బంతుల్లో 17x4, 2x6) శతకాలతో విజృంభించి ఆడారు. ఆఖర్లో మనీశ్‌ పాండే (50; 42 బంతుల్లో 4x4), ధోనీ (49; 42 బంతుల్లో 5x4, 1x6) సైతం దంచికొట్టడంతో భారత్‌ చివరికి లంకేయులపై నాలుగో అత్యుత్తమ స్కోర్‌ సాధించింది. ఈ నేపథ్యంలోనే ఇంకోసారి భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆ జట్టు 207 పరుగులకే కుప్పకూలింది. ఏంజిలో మాథ్యూస్‌(70; 80 బంతుల్లో 10x4) మరోసారి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని