IOC 2023: 40 ఏళ్ల తర్వాత భారత్‌లో అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ సెషన్

వచ్చే ఏడాది ముంబయిలో అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ 2023 సెషన్‌ నిర్వహించేందుకు భారత్‌ హక్కులు దక్కించుకుంది. దీంతో 40 ఏళ్ల తర్వాత మనకు ఆ గౌరవం లభించింది...

Updated : 19 Feb 2022 19:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చే ఏడాది ముంబయిలో అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ 2023 సెషన్‌ నిర్వహించేందుకు భారత్‌ హక్కులు దక్కించుకోవడం గొప్ప గౌరవమని ఐఓసీ సభ్యురాలు, రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల తర్వాత భారత్‌కు అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ సమావేశం నిర్వహించే అదృష్టం దక్కిందని, దీంతో భారత్‌లోని యువత ఈ ఒలింపిక్స్‌ విశేషాలను తెలుసుకునేందుకు చక్కటి అవకాశం లభించిందని ఆమె అన్నారు. అలాగే రాబోయే రోజుల్లో మన దేశంలో ఒలింపిక్స్‌ క్రీడలు నిర్వహించడం మన కల అని ఆమె పేర్కొన్నారు.

1983లో చివరిసారి దిల్లీలో ఈ ఐఓసీ సెషన్‌ నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు భారత్‌ ఆ విశిష్ట సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రస్తుతం బీజింగ్‌లో జరుగుతోన్న 139వ ఐఓసీ సెషన్‌లో భారత బృందం ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ సభ్యులకు ఓ ప్రెజెంటేషన్‌ ఇచ్చి ఒప్పించింది. ఇందులో 2008 ఒలింపిక్స్‌ బంగారు పతక విజేత అభినవ్‌బింద్రాతో పాటు ఐఓసీ సభ్యురాలు నీతా అంబానీ, భారత ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరిందర్‌ బాట్రా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పాల్గొన్నారు. ఐఓసీ సెషన్‌ అనేది కమిటీ సభ్యుల సమావేశం. ఒలింపిక్స్‌కు సంబంధించిన విషయాలను ఇందులో చర్చించి తీసుకునే నిర్ణయాలే అంతిమమైనవి. సహజంగా ఏడాదికోసారి ఈ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. అయితే, కీలకమైన సెషన్లు మాత్రం ఐఓసీ అధ్యక్షుడి పర్యవేక్షణలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 101 సభ్యులు ఉన్నారు. మరో 45 మంది గౌరవ సభ్యులుగా కొనసాగుతుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని