Manish pandey: లఖ్‌నవూలో లేనన్న విషయం జాబితా చూసి తెలుసుకున్నా: మనీశ్‌ పాండే

మాటమాత్రమైనా చెప్పకుండానే లఖ్‌నవూ తనను పక్కన పెట్టిందంటూ మనీశ్‌పాండే అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Published : 25 Nov 2022 01:41 IST

దిల్లీ: భారత టీ20 లీగ్‌ ఫ్రాంఛైజీలు ఇటీవల కొందరు ఆటగాళ్లను వదిలేసి, కొందరిని అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. త్వరలో ప్రారంభం కానున్న మెగా టోర్నీ నేపథ్యంలో జట్లు కీలక ఆటగాళ్లను పక్కనపెట్టడం చర్చనీయాంశమైంది. పంజాబ్‌ జట్టు కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ను.. 11ఏళ్లుగా జట్టులో కొనసాగుతోన్న వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావోను చెన్నై జట్లు వదిలేశాయి. అయితే, మాటమాత్రమైనా చెప్పకుండానే లఖ్‌నవూ జట్టు తనను పక్కన పెట్టిందంటూ మనీశ్‌పాండే అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను జట్టులో లేనన్న విషయం జాబితాలో చూసి తెలుసుకోవాల్సి వచ్చిందన్నాడు. 

‘‘నాకెవ్వరూ ఈ విషయం చెప్పలేదు. జాబితాను విడుదల చేసిన రోజే నాకూ తెలిసింది. నాకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయినా  ఫరవాలేదు. ఎందుకంటే ఆటగాళ్లు అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఎక్కువ గేమ్‌లు ఆడలేకపోవడం వల్ల జట్టు నన్ను వదిలేసి డబ్బులు ఆదా చేసుకోవాలనుకుంది. లేకపోతే నా స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవాలనుకుందేమో. వారి ప్లాన్‌ ఏదైనా కావచ్చు. ఇప్పటివరకైతే వేరే ఏ జట్టు నన్ను సంప్రదించలేదు. ఇకపై ఆడే మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేయాలని మాత్రమే ఆలోచిస్తున్నా. మిగిలింది విధి నిర్ణయం’’ అని వివరించాడు.

టీమ్‌ఇండియా తరఫున 29 వన్డేలు, 39 టీ20ల్లో ఆడిన మనీశ్‌పాండేకు 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ చివరిది. సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌ వంటి బ్యాటర్లకు సెలక్టర్లు అవకాశం ఇవ్వడంతో మనీశ్‌ పాండే స్థానం గల్లంతైంది. తాను మాత్రం తిరిగి జట్టులోకి రావాలనే కోరుకుంటానన్నాడు. అయితే ఇటీవల జట్టులో సంజూ చేరిక తనకు సంతోషాన్ని కలిగించిందన్నాడు. ‘‘జట్టులో లేకపోవడం వ్యక్తిగతంగా కాస్త బాధగానే ఉంటుంది. కానీ టీమ్‌ఇండియాలో గొప్పగా రాణిస్తున్న వారిని చూసి నేను కూడా సంతోషిస్తా. సంజూ బాగా ఆడుతున్నాడు కాబట్టే అతడికి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి అని అనుకుంటా. దురదృష్టవశాత్తూ నేను ఎక్కువ మ్యాచ్‌ల్లో భాగం కాలేకపోతున్నా. మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి’’ అని పాండే పేర్కొన్నాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని