Bumrah : టీమ్‌ఇండియాలో ‘ఆరు‘ వికెట్ల హీరోలు.. బుమ్రాకు ముందు ఎవరున్నారంటే..?

నిప్పులు చెరిగే బంతులు అంటే ఇవేనేమో అనిపించేలా బౌలింగ్‌.. భీకరమైన ప్రత్యర్థి బ్యాటర్లు హడలెత్తారు. పరుగుల సంగతి పక్కన పెట్టేద్దాం.. కనీసం బంతిని టచ్‌ చేస్తే ...

Updated : 13 Jul 2022 12:19 IST

ఇంటర్నెట్ డెస్క్: నిప్పులు చెరిగే బంతులు అంటే ఇవేనేమో అనిపించేలా బౌలింగ్‌.. భీకరమైన ప్రత్యర్థి బ్యాటర్లు హడలెత్తారు. పరుగుల సంగతి పక్కన పెట్టేద్దాం.. కనీసం బంతిని టచ్‌ చేస్తే చాలు అన్నట్లుగా వారి బ్యాటింగ్‌ సాగింది.. ఇలాంటి బౌలింగ్‌ ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా - షమీ స్పెల్‌ను చూస్తే తెలుస్తుంది. బుమ్రా అయితే టాప్‌క్లాస్‌ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో వన్డేల్లో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకొన్నాడు. ఇప్పటి వరకు టీమ్‌ఇండియా తరఫున బుమ్రా కాకుండా వన్డేల్లో నలుగురు మాత్రమే ఆరు వికెట్ల ప్రదర్శన చేశారు. అందులో మరి ఆ ‘నలుగురు’ ఎవరనేది తెలుసుకుందాం.. 

ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకొని ఊపులో ఉన్న భారత్‌.. వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్‌ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  అద్భుతమైన బౌలింగ్‌ (6/19)తో ఇంగ్లాండ్‌ 110 పరుగులకే కుప్పకూలడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఇదే అతడి కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. అంతేకాకుండా ఐదు వికెట్లు అంతకంటే ఎక్కువ ప్రదర్శన చేయడం బుమ్రాకిది ఇది రెండోసారి మాత్రమే. ఇందులోనూ నలుగురు బ్యాటర్లు క్లీన్‌బౌల్డ్‌ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో అన్ని వికెట్లను పేసర్లే పడగొట్టారు. వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మూడో బౌలర్‌గా బుమ్రా ఘనత సాధించాడు.

తొలి స్థానం స్టువర్ట్‌ బిన్నీదే

(ఫొటో సోర్స్‌: స్టువర్ట్‌ బిన్నీ ట్విటర్)

టీమ్‌ఇండియా తరఫున ఆడింది తక్కువ మ్యాచ్‌లు అయినా.. తనకంటూ ఓ రికార్డును సృష్టించుకున్నాడు స్టువర్ట్‌ బిన్నీ. అలనాటి క్రికెటర్‌ రోజర్‌ బిన్నీ కుమారుడు అయినప్పటికీ అవకాశాలు అంత తేలిగ్గా రాలేదు. అయితే వచ్చిన అవకాశాలను మాత్రం బాగానే ఒడిసి పట్టుకున్నా.. ఆ తర్వాత నిలదొక్కుకోలేకపోయాడు. ఈ క్రమంలో భారత వన్డే క్రికెట్‌ చరిత్రలో తక్కువ పరుగులకే ఆరు వికెట్ల తీసిన బౌలర్‌గా స్టువర్ట్‌ బిన్నీ రికార్డుకెక్కాడు. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బిన్నీ కేవలం నాలుగు పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఇదే ఇప్పటి వరకు రికార్డుగా కొనసాగుతోంది. అత్యల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో స్టువర్ట్‌ ప్రదర్శనతోనే భారత్‌ విజయంతో గట్టెక్కడం విశేషం. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 105 పరుగులకే ఆలౌటైంది. అయితే స్టువర్ట్‌ బిన్నీ (4/6) దెబ్బకు బంగ్లాదేశ్‌ కేవలం 58 పరుగులకే కుప్పకూలింది. బిన్నీ రికార్డును చెరపడం కష్టమే.

దిగ్గజ స్పిన్నర్‌ కుంబ్లే దెబ్బకు..

భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే సాధించిన రికార్డులు కోకొల్లలు. అందులో వన్డే కెరీర్‌లోనూ ఓ ఘనతను తన ఖాతాలో వేసుకొన్నాడు. వన్డేల్లో బిన్నీ (4/6) ప్రదర్శన చేసేవరకు అనిల్‌ కుంబ్లే (6/12) గణాంకాలే అత్యుత్తమం. 1993లోనే కుంబ్లే వెస్టిండీస్‌ మీద సూపర్‌ స్పెల్‌ వేశాడు. భీకర ఆటగాళ్లున్న విండీస్‌ ఆట కట్టించడంలో కుంబ్లే కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. అనంతరం విండీస్‌ 123 పరుగులకే కుప్పకూలింది. టాప్‌ ఆర్డర్‌ మినహా ఇతర బ్యాటర్లను కుంబ్లే చుట్టేయడంతో విండీస్‌పై భారత్‌ 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు దేశాలు (భారత్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌, జింబాబ్వే) పాల్గొన్న కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అనిల్‌ కుంబ్లే అద్భుత స్పెల్‌తో టీమ్‌ఇండియా చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది.  

వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో.. 

వన్డే ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచూ కీలకమే. వరుస విజయాలతో భారత్‌ 2003 ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే అక్కడ ఆసీస్‌ చేతిలో పరాభవం తప్పలేదు. రన్నరప్‌గా టోర్నీని ముగించింది. ఈ మెగా టోర్నమెంట్‌లో సచిన్‌ ఫైనల్‌ మినహా ఆద్యంతం అత్యంత నిలకడగా రాణించాడు. అదే విధంగా బౌలింగ్‌లో జహీర్‌ ఖాన్‌, అశిశ్‌ నెహ్రా సూపర్‌ బౌలింగ్‌ వేశారు. ఈ క్రమంలో ఆశిశ్‌ నెహ్రా వన్డే చరిత్రలో తన పేరిట ఓ రికార్డును నమోదు చేసుకొన్నాడు. లీగ్ దశలో ఇంగ్లాండ్‌పై 6/23 స్పెల్‌తో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 168 పరుగులకే ఆలౌటైంది. ఆశిశ్‌ నెహ్రా స్వల్ప విరామాల్లో వికెట్లు పడగొట్టి టీమ్‌ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. నెహ్రాతోపాటు జహీర్‌ ఖాన్‌ (2/29), జవగల్‌ శ్రీనాథ్‌ (1/37) తోడ్పాటు అందించడంతో ఇంగ్లాండ్‌ కుప్పకూలింది. రనౌట్‌ మినహా అన్ని వికెట్లను పేసర్లే తీయడం విశేషం.

ఇంగ్లాండ్‌పైనే కుల్‌దీప్‌ యాదవ్‌

లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (6/25) కూడా ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు. అదీనూ ఇంగ్లాండ్‌పైనే కావడం విశేషం. 2018లో ఇంగ్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 49.5 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 40.1 ఓవర్లలో 269 పరుగులు చేసి గెలుపొందింది. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై కుల్‌దీప్‌ సంచనల స్పెల్‌ వేశాడు. 10 ఓవర్లు వేసిన కుల్‌దీప్‌ ఆరు వికెట్లు తీసి 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని