INDw Vs SLw: మహిళల ఆసియా కప్‌లో భారత్‌ బోణీ.. లంకపై ఘన విజయం

మహిళల ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా బోణీ కొట్టింది. తొలుత బ్యాటర్లు.. తర్వాత బౌలర్లు రాణించడంతో  శ్రీలంకపై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Updated : 01 Oct 2022 16:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల ఆసియా కప్‌లో భారత్‌ బోణీ కొట్టింది. గ్రూప్‌ స్టేజ్‌లో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో లంక18.2 ఓవర్లలో కేవలం 109 పరుగులకే ఆలౌటైంది. హాసిని పెరెరా (30*) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్‌ హర్షిత మాధవి (26) ఫర్వాలేదనిపించింది. మిగతా బ్యాటర్లలో చమరి ఆటపట్టు 5, మల్షా షెహాని 9, నీలాక్షి డి సిల్వా 1, అనుష్క 5, రనసింగె 1, సుగందిక 4 పరుగులు చేశారు. భారత బౌలర్లలో దయాలన్‌ హేమలత 3, పూజా వస్త్రాకర్ 2, దీప్తి శర్మ 2, రాధా యాదవ్ ఒక వికెట్ తీశారు.

బ్యాటింగ్‌లో అదరగొట్టిన రోడ్రిగ్స్‌

భారత్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించడానికి ప్రధాన కారణం జెమీమా రోడ్రిగ్స్‌ (76). అద్భుతమైన అర్ధశతకం నమోదు చేయడంతో టీమ్‌ఇండియా 150 పరుగులు చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఓపెనర్లు మంధాన, షఫాలీ పెవిలియన్‌కు చేరారు. దీంతో 4 ఓవర్లకు టీమ్‌ఇండియా స్కోరు 23/2. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన జెమీమా-హర్మన్‌ (33) కలిసి మూడో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరిపాటు పూజా వస్త్రాకర్‌ (1), రిచా ఘోష్‌ (9) వికెట్లు పడటంతో భారీ స్కోరు సాధించడంలో టీమ్‌ఇండియా విఫలమైంది. హేమలత 13 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రనసింగె 3.. సుగందిక కుమారి, చమరి ఆటపట్టు చెరో వికెట్‌ తీశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని