Sunil Gawaskar : కంగారూల గడ్డపై టెస్టు సిరీస్ సాధించడం.. సువర్ణాధ్యాయం : సునీల్ గావస్కర్‌

కంగారూల గడ్డపై భారత జట్టు తొలి టెస్టు సిరీస్ సొంతం చేసుకోవడం.. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయమని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ అన్నాడు. ఇటీవల కాలంలో టీమ్‌ఇండియా సాధించిన...

Updated : 13 Jan 2022 13:41 IST

ఇంటర్నెట్డెస్క్‌ : కంగారూల గడ్డపై భారత జట్టు వరుసగా రెండోసారి టెస్టు సిరీస్ సొంతం చేసుకోవడం.. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయమని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ అన్నాడు. ఇటీవల కాలంలో టీమ్‌ఇండియా సాధించిన విజయాల్లో ఇదే అత్యంత గొప్ప విజయమని పేర్కొన్నాడు. భారత జట్టులోని సీనియర్లు గాయాల పాలైనా.. యువకులు చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో రాణించి ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించారని ప్రశంసించాడు. 

‘తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం పాలైన టీమ్‌ఇండియా.. రెండో టెస్టులో పుంజుకున్న తీరు అద్భుతం. ఆ మ్యాచులో భారత్‌ సాధించిన విజయం ఆటగాళ్ల దృఢ సంకల్పానికి నిదర్శనం. సిరీస్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించి కంగారూల గడ్డపై సిరీస్ సాధించడమనేది భారత క్రికెట్‌ చరిత్రలో సువర్ణాధ్యాయం. అలాంటి చారిత్రక విజయాన్ని చూసినందుకు చాలా గర్వపడుతున్నాను’ అని సునీల్ గావస్కర్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించి త్వరలో ఏడాది పూర్తి కానున్న సందర్భంగా.. ‘డౌన్‌ అండర్‌గోస్‌ - ఇండియాస్‌ గ్రేటెస్ కమ్‌బ్యాక్‌’ అనే ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను జనవరి 14 నుంచి ‘సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌’ ప్రసారం చేయనుంది. ఈ సందర్భంగా భారత్‌ సాధించిన ఘన విజయంపై సునీల్ గావస్కర్‌ తన అభిప్రాయాలను సోనీ స్పోర్ట్స్ ఛానల్‌తో పంచుకున్నారు.

అజింక్య రహానె నాయకత్వంలోని టీమ్‌ఇండియా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత మెల్ బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. హనుమ విహారి, సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అసమాన పోరాటం చేయడంతో సిడ్నీలో జరిగిన మూడో టెస్టు డ్రా గా ముగిసింది. సిరీస్‌ నిర్ణయాత్మక నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా సమష్టిగా రాణించి.. మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టును ఓడించింది. దీంతో కంగారూల గడ్డపై రెండోసారి భారత్‌ బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్ సాధించి చరిత్ర సృష్టించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని