
టీమిండియాకు షాక్: సిడ్నీ మ్యాచ్ హీరో ఔట్!
ఇంటర్నెట్డెస్క్: భారత ఆటగాళ్లకు గాయాల బెడద వీడట్లేదు. ఇప్పటికే మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాలతో ఆస్ట్రేలియా సిరీస్కు దూరమయ్యారు. కాగా, తాజాగా మరో ఆటగాడు హనుమ విహారి కూడా గాయంతో సిరీస్కు దూరం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సిరీస్లో చివరి టెస్టుకు అతడు దూరం కానున్నాడని, అంతేగాక స్వదేశంలో జరగనున్న ఇంగ్లాండ్ టెస్టు సిరీస్కు కూడా అందుబాటులో ఉండే అవకాశాలు లేవని వెల్లడించాయి.
‘‘విహారి పిక్క గాయం తీవ్రత స్కానింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అయితే అతడికి గ్రేడ్-1 స్థాయిలో గాయమైతే పూర్తిగా కోలుకోవడానికి కనీసం నాలుగు వారాల సమయం పడుతుంది. కాబట్టి విహారి బ్రిస్బేన్ టెస్టులో మాత్రమే కాదు, స్వదేశంలో జరగనున్న ఇంగ్లాండ్ సిరీస్కు దూరమవుతాడు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గ్రేడ్-2,3 కంటే గ్రేడ్-1 స్థాయి గాయం తీవ్రత తక్కువ.
సిడ్నీ టెస్టు చివరి రోజు ఆటలో విహారికి గాయమైన సంగతి తెలిసిందే. అయితే నొప్పిని భరిస్తూ కూడా విహారి స్ఫూర్తిదాయక పోరాటం చేశాడు. అశ్విన్తో కలిసి దాదాపు 50 ఓవర్ల పాటు క్రీజులో నిలబడి జట్టును ఓటమి నుంచి రక్షించాడు. విహారి అనుసరించిన బ్లాక్థాన్ వ్యూహంపై ప్రశంసల జల్లు కురిసింది. ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే విహారిని కొనియాడుతూ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. ‘విజయలక్ష్మి గారు.. మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు’ అని ట్వీటాడు.
అయితే సిడ్నీ టెస్టులో గొప్ప ప్రదర్శన చేసిన విహారి జట్టుకు దూరమవ్వడం టీమిండియాకు ప్రతికూలాంశమే. అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి సాహా జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పంత్ను బ్యాట్స్మన్గా పరిగిణించి సాహాతో వికెట్కీపింగ్ చేయిస్తారని భావిస్తున్నారు. మరోవైపు జడేజా గైర్హాజరీలో శార్దూల్ ఠాకూర్కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. వేలు విరగడంతో జడ్డూ సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. బ్రిస్బేన్ వేదికగా జనవరి 15న ఆస్ట్రేలియాతో భారత్ ఆఖరి టెస్టు ఆడనుంది.
ఇదీ చదవండి
ఆసీస్ విజయానికి అడ్డేసిన విహారి, అశ్విన్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.