IND vs NZ: అదనపు బ్యాటర్‌కు బదులు.. హుడాను ఎందుకు తీసుకోలేదు?: మాజీ సెలెక్టర్

ఆరో బౌలర్‌ ఆప్షన్ లేకపోతే ఎంత నష్టమో న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో టీమ్ఇండియాకు తెలిసివచ్చింది. బౌలర్లను మార్చడానికి వీలులేకపోతే ప్రత్యర్థి బ్యాటర్లను అడ్డుకోవడం చాలా కష్టం. తదుపరి రెండు వన్డేల్లోనైనా కీలక మార్పులు చేయాలని మాజీలు సూచిస్తున్నారు.

Published : 26 Nov 2022 16:51 IST

ఇంటర్నెట్ డెస్క్: తొలి వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ.. కీలకమైన సమయంలో వికెట్లు తీయడంలో భారత బౌలర్లు విఫలకావడంతో ఓటమి తప్పలేదు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియాకు పార్ట్‌టైమ్‌ బౌలర్ కొరత తెలిసొచ్చింది. సదరు బౌలర్లను కొడుతున్నప్పటికీ అతడికే బంతిని ఇవ్వడం మినహా కెప్టెన్ శిఖర్ ధావన్‌ వద్ద మరో ఆప్షన్‌ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే టీ20ల్లో రాణించిన ఆల్‌రౌండర్‌ దీపక్ హుడాను ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న తలెత్తింది. తాజాగా బీసీసీఐ మాజీ సెలెక్టర్‌ సబా కరీం కూడా ఇదే విషయంపై స్పందించాడు. 

‘‘అదనంగా ఎందుకు బ్యాటర్‌ను తీసుకొందో నాకైతే అర్థం కాలేదు. అయితే దీపక్ హుడాను తీసుకొని ఉంటే బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ ఉపయోగపడేవాడు. మరోవైపు ఆరో బౌలర్‌ లేకుండా భారత్‌ బరిలోకి దిగింది. తప్పకుండా ఆరో బౌలర్‌ ఆప్షన్ ఉండాల్సిందే. ఇటీవల కేవలం ఐదుగురు బౌలర్లతోనే ఆడటం గమనించా. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. అదనంగా మరొక బ్యాటర్‌ను తీసుకొనే బదులు దీపక్‌ హుడాకు అవకాశం ఇస్తే బాగుండేది. సెలెక్టర్లు చాలా మంది బ్యాటర్లతో కూడిన జట్టునే ప్రకటిస్తున్నారు. మరి ఆల్‌రౌండర్లు ఎక్కడ? ఒకరి బదులు మరొక ఆల్‌రౌండర్‌ను రీప్లేస్‌ చేసే అవకాశం ఉందా..? సెలెక్షన్ కమిటీ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  అలాగే స్పిన్నర్లూ ఇబ్బంది పడ్డారు. ప్రత్యర్థి బ్యాటర్లు స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌ ఆడినప్పుడు మన స్పిన్‌ బౌలర్లు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి బ్యాటర్లను ఎదుర్కొనేలా మన బౌలర్లను ఎందుకు సన్నద్ధత చేయడం లేదు? కనీసం ఫీల్డింగ్‌నైనా మార్చుకోగలిగాలి. లేకపోతే భవిష్యత్తులోనూ ఇలానే ఇబ్బంది పడాల్సి ఉంటుంది’’ అని సబా కరీం విశ్లేషించాడు. ఆరో బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ను టీమ్‌ఇండియా తీసుకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని