IPL 2021: ఫైనల్‌లో డుప్లెసిస్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌.. కేకేఆర్‌ ఎదుట భారీ లక్ష్యం

సీఎస్‌కే, కేకేఆర్‌ జట్ల మధ్య ఐపీఎల్‌ 2021 ఫైనల్‌ మ్యాచ్‌

Updated : 15 Oct 2021 21:26 IST

దుబాయ్‌: కోల్‌కతాతో జరుగుతున్న ఐపీఎల్‌ తుదిపోరులో చెన్నై బ్యాటర్లు చెలరేగారు. సీఎస్‌కే ఓపెనర్ డుప్లెసిస్‌ (86 పరుగులు: 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్‌కు 193 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. చెన్నై ఓపెనర్లు డుప్లెసిస్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ (32) జంట తొలి వికెట్‌కు (61 పరుగులు) శుభారంభం అందించారు. రుతురాజ్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రాబిన్‌ ఉతప్ప (31) ధాటికి ఆడాడు. ఈ క్రమంలో షాట్‌కు యత్నించి నరైన్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. రుతురాజ్‌ కూడా నరైన్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. రుతురాజ్‌, ఉతప్ప ఔటైనా చెన్నై దూకుడు మాత్రం తగ్గలేదు. ఓ ఎండ్‌లో డుప్లెసిస్‌ అర్ధశతకం సాధించి ఫాస్ట్‌గా ఆడగా.. మరోవైపు మొయిన్‌ అలీ (37* పరుగులు: 2 ఫోర్లు, 3 సిక్సర్లు) బీభత్సం సృష్టించాడు. అయితే ఇన్నింగ్స్‌ చివరి బంతికి డుప్లెసిస్‌ ఔటయ్యాడు. కోల్‌కతా బౌలర్లలో నరైన్ 2, శివమ్‌ మావి ఒక వికెట్‌ పడగొట్టాడు. మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని