IPL 2022 Auction: చెన్నై పోటీపడ్డా.. ముంబయి గూటికి బేబీ డివిలియర్స్‌

ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో శనివారం పలువురు భారత కుర్రాళ్లు రికార్డు ధరలకు అమ్ముడుపోయారు. మొత్తం పది ఫ్రాంఛైజీలు నాణ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడలేదు...

Published : 13 Feb 2022 09:38 IST

(Photo: Dewald Brevis Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో శనివారం పలువురు భారత కుర్రాళ్లు రికార్డు ధరలకు అమ్ముడుపోయారు. మొత్తం పది ఫ్రాంఛైజీలు నాణ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఈ క్రమంలోనే ఎప్పుడూ యువ టాలెంట్‌ను వెలికితీసే ముంబయి ఇండియన్స్‌ ఈసారి కూడా అదే పంథాను అనుసరించింది. బేబీ ఏబీ డివిలియర్స్‌గా పేరుగాంచిన దక్షిణాఫ్రికా యువ బ్యాటర్‌ డివాల్డ్‌ బ్రీవిస్‌ను రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. అతడీ వేలంలో కనీస ధర రూ.20లక్షలతో అడుగుపెట్టగా ముంబయి భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైంది. అందుకు కారణం ఇటీవల జరిగిన అండర్‌-19 ప్రపంచకప్పే. అక్కడ ఈ యువ బ్యాట్స్‌మన్‌ 506 పరుగులు చేశాడు. దీంతో టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో 18 ఏళ్ల నాటి శిఖర్‌ ధావన్‌ రికార్డును బద్దలుకొట్టాడు. 2004లో అంబటి రాయుడు కెప్టెన్సీలో ధావన్‌ 505 పరుగులు చేసి అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఇప్పుడు దాన్నే బేబీ డివిలియర్స్‌ అధిగమించాడు. మరోవైపు మెగా వేలంలో ఈ యువ ప్రతిభావంతుడిని తీసుకొనేందుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సైతం ఆసక్తి చూపింది. అయితే, చివరికి ముంబయి సొంతం చేసుకుంది. కాగా, అతడిని బేబీ డివిలియర్స్‌గా ఎందుకు పిలుస్తారంటే.. అతడు అచ్చం దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ తలపించేలా బ్యాటింగ్‌ చేస్తాడు. దీంతో అతడికి ఆ పేరు వచ్చింది. అలాగే అతడికి ఐపీఎల్‌లో డివిలియర్స్‌ ఆడిన ఆర్సీబీ జట్టంటే చాలా ఇష్టం. ఆ జట్టులో ఆడాలనే కోరిక ఉందని ఇటీవల ప్రపంచకప్‌ సమయంలో వెల్లడించడం గమనార్హం.

అండర్‌ 19 ప్రపంచకప్‌లో బ్రెవిస్‌ సాధించిన స్కోర్లు

* భారత జట్టుపై 65 పరుగులు

* ఉగాండాపై 104 పరుగులు

* ఐర్లాండ్‌పై 96 పరుగులు

* ఇంగ్లాండ్‌పై 97 పరుగులు

* శ్రీలంకపై 6 పరుగులు

* బంగ్లాదేశ్‌పై 138 పరుగులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని