Suresh Raina: సురేశ్ రైనా.. కథ కంచికేనా!
సురేశ్ రైనా.. ఒకప్పుడు భారత జట్టులో నిలకడైన ఆటగాడు. చెన్నైలో మేటి మొనగాడు. ఆటలో ఎంత నిబద్ధతతో ఉంటాడో కెరీర్ను కూడా అంతే కచ్చితత్వంతో నిర్మించుకున్నాడు...
గత రెండేళ్లలోనే అంతా మారిపోయింది..
సురేశ్ రైనా.. ఒకప్పుడు టీమ్ఇండియాలో నిలకడైన ఆటగాడు.. చెన్నై జట్టులో మేటి క్రీడాకారుడు. ఆటలో ఎంత నిబద్ధతతో ఉంటాడో కెరీర్ను కూడా అంతే కచ్చితత్వంతో నిర్మించుకున్నాడు. ఈ క్రమంలోనే అటు టీమ్ఇండియాలో, ఇటు చెన్నైలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా సీఎస్కేలో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తర్వాత అంతటి ఆటగాడిగా ఎదిగాడు. అలాంటి ఆటగాడిని చెన్నై ముందే వదులుకోవడం ఒకింత ఆశ్చర్యం అయితే, మెగా వేలంలోనూ ఎవరూ కొనుగోలు చేయకపోవడం మరింత విచారం. అయితే, అతడి కథ ఈ రెండేళ్లలోనే అడ్డం తిరిగింది. అది ఇప్పుడు కంచికి చేరినట్లు స్పష్టమవుతోంది.
రైనాదే తొలి 5000 మార్క్..
తొలి సీజన్ నుంచే సురేశ్ రైనా చెన్నై జట్టులో అంతర్భాగమయ్యాడు. ఎన్నిసార్లు వేలం పాటలు నిర్వహించినా, ఎన్నిసార్లు ఆటగాళ్ల రిటెన్షన్ పద్ధతులు కొనసాగినా చెన్నై ఎప్పుడూ అతడిని వదులుకోలేదు. ఎందుకంటే ఈ మెగా టోర్నీలో చెన్నై అత్యంత విజయవంతమైన జట్టుగా ఎదగడంలో అతడిదే కీలక పాత్ర. 2016, 2017 సీజన్లలో ఆ జట్టు నిషేధానికి గురైనప్పుడు మినహాయిస్తే గడిచిన 14 ఏళ్లలో 11 సీజన్లు చెన్నైతోనే కొనసాగాడు. 2018లో తిరిగి ధోనీ చెంత చేరిన అతడు జట్టు మూడోసారి ట్రోఫీ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2019లో 5 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే ఈ టీ20 లీగ్లో మొత్తం 205 మ్యాచ్లు ఆడిన రైనా.. 5,528 పరుగులు చేసి.. టోర్నీలో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ప్రస్తుతం నాలుగో స్థానంలో నిలిచాడు. అందులో ఒక శతకం, 39 అర్ధ శతకాలు ఉండటం విశేషం.
గత రెండేళ్లుగా అనిశ్చితి..
ఇంత గొప్ప రికార్డులున్న రైనా జీవితం గత రెండేళ్లలోనే పూర్తిగా మారిపోయింది. తొలుత 2020లో కరోనా కారణంగా 13వ సీజన్ యూఏఈలో నిర్వహించగా.. ఆ సమయంలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2020 ఆగస్టు 15న ధోనీ టీమ్ఇండియాకు గుడ్బై చెప్పిన మరుసటి క్షణమే రైనా సైతం అదే పని చేశాడు. యూఏఈకి వెళ్లేముందు చెన్నైలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం నుంచే ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఇక అదే నెలలో చెన్నై జట్టుతోనే యూఏఈకి వెళ్లిన రైనా కొద్ది రోజుల తర్వాత తిరిగి భారత్కు వచ్చేశాడు. ఆ సమయంలో వ్యక్తిగత కారణాలతోనే తిరిగి భారత్కు వచ్చేసినట్లు పేర్కొన్నాడు. కానీ, అసలు విషయం ఏమిటంటే.. ఆ సమయంలో పంజాబ్లో ఉంటున్న రైనా దగ్గరి బంధువులపై దుండగులు దాడి చేశారు. ఆ చేదు ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్రగాయాల పాలయ్యారు. దీంతో భయాందోళనకు గురైన తన కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండేందుకే రైనా 2020 సీజన్ను ఆడలేదు.
యాజమాన్యంతో విభేదాలు?
అయితే, రైనా భారత్కు తిరిగి వచ్చినప్పుడు చెన్నై జట్టు యాజమాన్యంతో పడట్లేదనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. యూఏఈలో చెన్నై టీమ్ ప్రత్యేకంగా బసచేసిన హోటల్లో కెప్టెన్ ధోనీకి కేటాయించిన గది (బాల్కనీ వ్యూ ఉన్నది) లాంటిదే తనకూ కావాలని రైనా పట్టుబట్టినట్లు, దానికి యాజమాన్యం అంగీకరించనట్లు పుకార్లు షికార్లు చేశాయి. అందువల్లే రైనా ఆగ్రహించి భారత్కు తిరిగి వచ్చాడని వార్తలు వచ్చాయి. అదే సమయంలో చెన్నై యజమాని ఎన్.శ్రీనివాసన్ సైతం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో నిజంగానే రైనాకు ఆ జట్టుతో పడటం లేదనే అభిప్రాయం కలిగింది. ‘ఇంకా సీజన్ మొదలవ్వలేదు. ఇలా చేయడం (తిరిగి రావడం) వల్ల అతడు ఏం కోల్పోతాడనే సంగతి తర్వాత తెలుసుకుంటాడు. అతడికి వచ్చే డబ్బు కూడా నష్టపోతాడు. ఎవరైనా ఒకవేళ జట్టుతో సంతోషంగా లేకపోతే తిరిగి వెళ్లొచ్చు. నేను ఎవరినీ బలవంత పెట్టను. కొన్నిసార్లు సక్సెస్ నెత్తికెక్కుతుంది’ అని శ్రీనివాసన్ పరుష వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఈ విషయంపై స్పందించిన రైనా.. తనకు చెన్నై జట్టుతో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశాడు. తనపై వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశాడు.
అదొక్కటే కారణమా..?
అంతా సర్దుకున్నా 2022 సీజన్కు ముందు చెన్నై టీమ్ రైనాను రిటైన్ చేసుకోకపోవడమే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు అతడు ధోనీకి అత్యంత సన్నిహితుడు కావడంతోనూ వేలంలో తిరిగి దక్కించుకుంటుందనే భావన అభిమానుల్లో నెలకొంది. అయితే, వేలంలోనూ అతడిని తీసుకోకపోవడంతో ఇప్పుడు వారంతా విస్మయానికి గురవుతున్నారు. కాగా, చెన్నై.. అతడిని వదిలేయడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా రైనా సరైన పోటీ క్రికెట్ ఆడటం లేదు. గత సీజన్లోనూ పూర్తిగా తడబడ్డాడు. ఆడిన 12 మ్యాచ్ల్లో కేవలం 160 పరుగులే చేసి తొలిసారి ఐపీఎల్ టోర్నీలో విఫలమయ్యాడు. దీంతో అటు అంతర్జాతీయ క్రికెట్కు దూరమవ్వడం, ఇటు రెండేళ్లుగా సరైన సాధన లేకపోవడం వంటి కారణాలను చెన్నై పరిగణలోకి తీసుకొని ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే రైనాను తిరిగి కొనసాగించాలంటే రూ.కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈసారి మెగా వేలంలో కొత్త జట్టును రూపొందిస్తామని ధోనీ గతంలోనే చెప్పడంతో అంత మొత్తం రైనాకు ఎందుకివ్వాలని కూడా ఆలోచించి ఉండొచ్చు. అందుకే చెన్నై ముందే రైనాను వదిలేసింది. దీంతో వేలంలోనూ కన్నెత్తి చూడలేదు. అయితే, అన్నిటికన్నా మరింత బాధ కలిగించే విషయం.. ఇతర జట్లు సైతం ఈ టాప్ బ్యాట్స్మన్ను కొనుగోలు చేయకపోవడం. దీంతో ఇక రైనా కెరీర్ పూర్తిగా ముగిసినట్లేనని అర్థమవుతోంది. ఇక భవిష్యత్తులో అతడు ఏ నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తిగా మారింది.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.