IPL 2022: ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీకి జోడీగా స్టార్‌ బ్యాట్స్‌మన్‌!

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్‌-15 సీజన్‌ ప్రారంభంకానుంది. ఈసారి రెండు కొత్త జట్లు రావడంతో పాటు మెగా వేలం నిర్వహించడంతో అన్ని జట్లలోని ఆటగాళ్లు పూర్తిగా మారిపోయారు...

Published : 03 Mar 2022 09:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్‌-15 సీజన్‌ ప్రారంభంకానుంది. ఈసారి రెండు కొత్త జట్లు రావడంతో పాటు మెగా వేలం నిర్వహించడంతో అన్ని జట్లలోని ఆటగాళ్లు పూర్తిగా మారిపోయారు. దీంతో ప్రతి జట్టు ఈసారి కొత్త ఆలోచనలు, కొత్త కాంబినేషన్లను అనుసరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సైతం ఈసారి టాప్‌ ఆర్డర్‌లో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. ఆ జట్టు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మహ్మద్‌ సిరాజ్‌ మాత్రమే ఉన్నారు. ఇక మిగతావారందర్నీ వేలంలోనే కొనుగోలు చేసింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఆటగాడు దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఫా డుప్లెసిస్‌. అతడిని ఈ ఫ్రాంఛైజీ రూ.7 కోట్ల అత్యధిక ధర వెచ్చించి మరీ కొనుగోలు చేయడం విశేషం. దీంతో టాప్‌ఆర్డర్‌లో అతడికి కోహ్లీకి తోడుగా బరిలోకి దింపాలని ఆ జట్టు భావిస్తోంది. అందుకు సంబంధించిన ఓ మార్ఫింగ్‌ ఫొటోను కూడా ఆర్సీబీ ట్విటర్‌లో పంచుకుంది.

కోహ్లీ, డుప్లెసిస్‌ ఆర్సీబీ జెర్సీలో ఉన్నట్లు రూపొందించిన ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేసి ‘భవిష్యత్‌కు సంబంధించిన ఫొటో ఇది. ఈ ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు కలిసి బరిలోకి దిగితే చూడాలని ఆసక్తిగా ఉంది’ అని వ్యాఖ్యానాలు జోడించింది. దీంతో వీరిద్దరూ కలిసి ఓపెనింగ్‌ చేసే వీలుందని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు కోహ్లీ గతేడాది కెప్టెన్సీ పగ్గాలు వదిలేయడంతో ఆ బాధ్యతలు ఎవరు చేపడతారా అనే ఆసక్తి మొదలైంది. మెగా వేలం పూర్తయి చాలా రోజులైనా ఇంకా ఆర్సీబీ కొత్త సారథి పేరు వెల్లడించలేదు. దీంతో ఈ విషయంపైనా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ బాధ్యతల్ని డుప్లెసిస్‌ లేదా మాక్స్‌వెల్‌కు అప్పగించాలని అంటున్నారు. అయితే, ఆర్సీబీ యాజమాన్యం ఎవరిని ఎంపి చేస్తుందో చూడాలి. ఇక డుప్లెసిస్‌ గతేడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. అతడు 14వ సీజన్‌లో రుతురాజ్‌ (635) తర్వాత అత్యధిక పరుగులు (633) చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే టాప్‌ ఆర్డర్‌లో డుప్లెసిస్‌ రాణిస్తాడని ఆర్సీబీ భావించి వేలంలో కొనుగోలు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని