IPL: హమ్మయ్య.. ఇంటికెళ్లిన కంగారూలు!

ఐపీఎల్‌ ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు స్వదేశం చేరుకున్నారు. సిడ్నీ నగరంలో దిగారు. లీగు వాయిదా పడినప్పటి నుంచి వారు....

Published : 17 May 2021 15:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు స్వదేశం చేరుకున్నారు. సిడ్నీ నగరంలో దిగారు. లీగు వాయిదా పడినప్పటి నుంచి వారు మాల్దీవుల్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడే క్వారంటైన్ తరహాలో బస చేశారు. భారత్‌ నుంచి ఆసీస్‌కు నేరుగా విమాన ప్రయాణాలను నిషేధించడమే ఇందుకు కారణం.

ఏటా ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అందులో ఆసీస్‌ ఆటగాళ్లే ఎక్కువ మంది ఉంటారు. వారు లేని జట్టంటూ ఉండదు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ బయో బుడగ ఏర్పాటు చేయడంలో ఈ సారీ భారీ సంఖ్యలోనే క్రికెటర్లు వచ్చారు. వారితో పాటు సహాయ సిబ్బంది, వ్యాఖ్యాతలు వచ్చారు. హఠాత్తుగా కేసులు వెలుగు చూడటంతో లీగ్‌ నిరవధికంగా వాయిదా పడింది.

మిగతా దేశాల ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లినా కంగారూలు మాత్రం కొన్నాళ్లు వేరే చోట ఉండాల్సి వచ్చింది. భారత్‌ నుంచి నేరుగా ఎవ్వరూ రాకూడదని.. క్రికెటర్లకూ మినహాయింపు ఉండదని ఆసీస్‌ ప్రధాని నిబంధనలు పెట్టడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో కమిన్స్‌, వార్నర్‌, స్మిత్‌, స్లేటర్‌ సహా 38 మందితో కూడిన కంగారూల బృందం మాల్దీవుల్లో రెండు వారాలు బస చేసింది. ఆ తర్వాత న్యూసౌథ్‌ వేల్స్ ప్రభుత్వం వీరి క్వారంటైన్‌ వ్యవహారాలను పర్యవేక్షించింది. సోమవారం వీరంతా సిడ్నీకి చేరుకున్నారు. కాగా నెగెటివ్‌ వచ్చిన మైక్‌ హస్సీ ఖతార్‌ మీదుగా సోమవారం సాయంత్రం ఆసీస్‌ చేరుకోనున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని