T20 World Cup: ఇషాన్‌ను ఓపెనింగ్‌కు పంపొచ్చు.. అయితే: లక్ష్మణ్‌

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ఇషాన్‌ కిషన్‌ను ఓపెనింగ్‌కు పంపడంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. రోహిత్‌ శర్మను...

Published : 08 Nov 2021 17:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ను ఓపెనింగ్‌కు పంపడంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. రోహిత్‌ శర్మను కాదని.. ఇషాన్‌ను ఎలా పంపిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు విశ్లేషకులు. ఈ క్రమంలో ఇషాన్‌ కిషన్‌ను ఓపెనింగ్‌కు పంపడంపై మాజీ క్రికెట్‌ దిగ్గజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ స్పందించాడు. ఇషాన్‌ జట్టుకు ఎంతో విలువైన ఆటగాడని తెలిపాడు. అయితే కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ ఉన్నప్పుడు ఇషాన్‌ను ఆ స్థానానికి తీసుకోవడం మాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నాడు. అదే సమయంలో నామమాత్రమైన నమీబియా మ్యాచ్‌లో ఇషాన్‌తో ఓపెనింగ్‌కు ప్రయత్నించవచ్చని చెప్పాడు. 

కివీస్‌తో మ్యాచ్‌ గణాంకాల సంగతి పక్కనపెడితే.. పవర్‌ప్లేలో ఇషాన్‌ చాలా దూకుడుగా ఆడతాడని లక్ష్మణ్ వివరించాడు. ఓ షోలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇషాన్‌ కిషన్‌ చాలా అద్భుత ఆటగాడు. అందులో అనుమానమే లేదు. పవర్‌ప్లేలో ఉండే ఫీల్డింగ్‌ నిబంధనలను ఉపయోగించుకుని చెలరేగుతాడు. అయితే రోహిత్ శర్మ లేనప్పుడే ఇషాన్‌ను ఓపెనింగ్‌కు పంపాలి. ఎందుకంటే రోహిత్‌ మొదట్లో ఆచితూచి ఆడినా తర్వాత విధ్వంసం సృష్టిస్తాడు. నిలకడగా రాణిస్తూ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ తర్వాత కెప్టెన్సీ రేసులో రోహిత్‌ ఉన్నాడు. ఈ క్రమంలో కీలకమైన కివీస్‌తో మ్యాచ్‌లో ఓపెనింగ్‌ జోడీని మార్చకుండా ఉండాల్సిందని, ఇషాన్‌ను తీసుకునేందుకు అలా చేయడం సరికాదు’’ అని స్పష్టం చేశాడు. సెమీస్‌ అవకాశాలు కోల్పోయి టీమ్‌ఇండియా ఇవాళ నమీబియాతో టోర్నీలో తన ఆఖరి మ్యాచ్‌ను ఆడనుంది. ఇప్పటికే రెండు గ్రూప్‌ల నుంచి ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరాయి. నాకౌట్‌లో నవంబర్‌ 10న ఇంగ్లాండ్-కివీస్‌, నవంబర్‌ 11న ఆసీస్‌-పాక్‌ జట్లు తలపడతాయి. 14వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని