ఒక్క మణికట్టు మాంత్రికుడికీ చోటివ్వరా?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, ఇంగ్లాండ్‌కు ఎంపిక చేసిన జట్టులో మణికట్టు స్పిన్నర్‌ లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని టీమ్‌ఇండియా...

Published : 08 May 2021 19:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, ఇంగ్లాండ్‌కు ఎంపిక చేసిన జట్టులో మణికట్టు స్పిన్నర్‌ లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా అన్నాడు. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను తీసుకోకపోవడం కఠిన నిర్ణయమేనని పేర్కొన్నాడు. కరోనా పరిస్థితుల్లో భారీ జట్లను ప్రకటించే సౌలభ్యం ఉంది కదా అని ప్రశ్నించాడు.

ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లే టీమ్‌ఇండియాను సెలక్టర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భువనేశ్వర్‌, హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌ను ఎంపిక చేయలేదు. యువ ఆటగాళ్లకే ప్రధాన్యమిచ్చారు. అర్జాన్‌ నాగ్వాస్‌వాలా అనే కొత్త కుర్రాడికి స్టాండ్‌బైగా అవకాశం ఇవ్వడం గమనార్హం.

‘వ్యక్తిగతంగా చెప్పాలంటే కుల్‌దీప్‌ యాదవ్‌కూ చోటివ్వకపోవడం కఠినం. అతడు ఎక్కువ క్రికెట్‌ ఆడలేదనడం బాధాకరం. ఇంగ్లాండ్‌ టెస్టు సిరీసులో అతడొకే మ్యాచు ఆడాడు. కొన్ని వికెట్లు తీశాడు. గులాబి టెస్టూ ఆడలేదు. ఇప్పుడు టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనలే కాదు ఏకంగా ఇంగ్లాండ్‌ సిరీసు మొత్తానికీ ఎంపికవ్వలేదు. కొవిడ్‌ పరిస్థితుల్లో ఎక్కువ మందితో జట్లను ప్రకటించే సౌలభ్యం దొరికింది. అలాంటప్పుడు కుల్‌దీప్‌కు ఎందుకు చోటివ్వకూడదు. నిజమే, ఇప్పుడు అశ్విన్‌, జడేజా, సుందర్‌, అక్షర్‌ పటేల్‌ రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. కానీ వారంతా ఫింగర్‌ స్పిన్నర్లు. మణికట్టు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇబ్బందిపడే ప్రత్యర్థి ఉన్నప్పుడు కుల్‌దీప్‌ను ఎందుకు తీసుకోకూడదు’ అని ఆకాశ్ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని