MS Dhoni: ధోనీ నీ ఆటను ఎప్పటికీ మరువం!

మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ టీమ్‌ఇండియాకు దూరమై అప్పుడే రెండేళ్లు గడిచాయి. 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన సెమీఫైనల్స్ మ్యాచే భారత్ తరఫున అతనాడిన చివరి వన్డే...

Updated : 10 Jul 2021 19:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ టీమ్‌ఇండియాకు దూరమై అప్పుడే రెండేళ్లు గడిచాయి. 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన సెమీఫైనల్స్ మ్యాచే భారత్ తరఫున అతనాడిన చివరి వన్డే. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమిపాలయ్యాక కొద్దికాలం ఆటకు విరామం తీసుకున్న మహీ మరుసటి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు అధికారికంగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అయితే, చివరిసారి అతను టీమ్‌ఇండియా జెర్సీలో కనిపించి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. అయినా, అభిమానులు ఇంకా ఆ చివరి క్షణాలను మర్చిపోలేకపోతున్నారు.

2019లో జులై 9న భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు సెమీఫైనల్స్‌లో తలపడ్డాయి. మాంచెస్టర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రెండు రోజులు జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 239 పరుగులు చేయగా, అదే ఆరోజు వర్షం కురవడంతో మ్యాచ్‌ను మరుసటి రోజుకు (రిజర్వ్‌ డే) తీసుకెళ్లారు. దాంతో జులై 10న మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమ్‌ఇండియా ఆదిలోనే ఘోరంగా తడబడింది. జట్టు స్కోర్‌ 5 పరుగులకే టాప్ ఆర్డర్‌లోని ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరారు. కేఎల్‌ రాహుల్‌ (1), రోహిత్‌ శర్మ (1), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఆపై రిషభ్‌ పంత్‌ (32), దినేశ్‌ కార్తీక్‌ (6), హార్దిక్‌ పాండ్య (32) సైతం ప్రభావం చూపలేకపోయారు.

ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 92 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిల్చుంది. ఆ సమయంలో జోడీ కట్టిన రవీంద్ర జడేజా (77; 59 బంతుల్లో 4x4, 4x6), మహేంద్రసింగ్‌ ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1x6) బాధ్యతాయుతంగా ఆడారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 116 పరుగులు జోడించి భారత శిబిరంలో ఆశలు రేపారు. కానీ కీలక సమయంలో ఫామ్‌లోకొచ్చిన న్యూజిలాండ్‌ వారిద్దర్నీ స్వల్ప వ్యవధిలో ఔట్‌ చేసి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకుంది. బౌల్ట్‌ బౌలింగ్‌లో జడేజా భారీ షాట్‌ ఆడి విలియమ్సన్‌ చేతికి చిక్కగా, కాసేపటికే ధోనీ రెండు పరుగుల కోసం ప్రయత్నిస్తూ రనౌటయ్యాడు. మార్టిన్‌ గప్తిల్‌ దూరం నుంచి డైరెక్ట్‌ త్రో విసరడంతో మహీ వెనుదిరక తప్పలేదు. దాంతో భారత్‌ ఓటమి ఖాయమైంది. చివరికి 221 పరుగులకు ఆలౌటవ్వడంతో కోహ్లీసేన 18 పరుగుల తేడాతో ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది. అదే ధోనీ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది. అభిమానులు ఇంకా ఆ చేదు జ్ఞాపకాలను మరువలేకపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని