T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ ముగింపు వేడుకల్లో భారత సంతతి అమ్మాయి

ఆస్ట్రేలియాలో ప్రఖ్యాత రియాలిటీ షో 'ది వాయిస్' ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన జానకి ఈశ్వర్.. ఆదివారం మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగే టీ20 ప్రపంచకప్‌  ముగింపు వేడుకల్లో పాల్గొననుంది.

Published : 12 Nov 2022 22:44 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ తుది సమరం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మెల్‌బోర్న్‌లో జరిగే టైటిల్‌ పోరులో పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ జట్లు తలపడనున్నాయి. తుదిపోరులో భారత్‌ ఆడకపోయినా మ్యాచ్‌ కోసం  భారత అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టోర్నీ ముగింపు వేడుకల్లో భారత సంతతికి చెందిన 13 సంవత్సరాల బాలిక సందడి చేయనుండటంమే ఇందుకు కారణం. 

ఆస్ట్రేలియాలో ప్రఖ్యాత రియాలిటీ షో 'ది వాయిస్' ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన జానకి ఈశ్వర్.. ఆదివారం మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొననుంది. ఆస్ట్రేలియాకు చెందిన ‘రాక్ బ్యాండ్ ఐస్‌హౌస్‌’తో కలిసి ఆమె  ప్రదర్శన ఇవ్వనుంది. జానకి తల్లిదండ్రులు అనూప్ దివాకరన్, దివ్య రవీంద్రన్ కేరళలోని కోజికోడ్‌కు చెందినవారు. 15 సంవత్సరాల నుంచి ఆస్ట్రేలియాలోనే ఉంటున్నారు.  

‘మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియంలో వేలాది మంది ప్రేక్షకుల ముందు ప్రదర్శన ఇవ్వబోతున్నా. దానిని టీవీల్లో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు వీక్షించనున్నారు. నిజంగా ఇది నాకు నమ్మశక్యం కాని అనుభవం. నా తల్లిదండ్రులు క్రికెట్‌కు వీరాభిమానులు. వారి ద్వారా నేను ఈ అవకాశం గురించి తెలుసుకున్నా. మ్యాచ్‌ కోసం ఇప్పటికే అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయని విన్నా. నేను నా ప్రదర్శనతో పాటు ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అయితే, భారత్ ఫైనల్ ఆడితే మరింత బాగుండేది’ అని జానకి ఈశ్వర్‌ ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని