Jasprit Bumrah: సర్జరీ తర్వాత ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లతో జస్ప్రీత్‌ బుమ్రా సందడి

ఇటీవల వెన్ను గాయానికి సర్జరీ చేయించుకున్న జస్ప్రీత్‌ బుమ్రా  (Jasprit Bumrah) ముంబయిలో జరిగిన డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ని స్టేడియానికి వచ్చి వీక్షించాడు.

Published : 27 Mar 2023 11:00 IST

(photo: mumbai indians instagram)

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా అగ్రశ్రేణి ఫాస్ట్‌బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) గత కొంతకాలం నుంచి వెన్ను గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ గాయం నుంచి పూర్తిగా బయటపడాలంటే శస్త్రచికిత్స నిర్వహించాలని వైద్యులు సూచించారు. దీంతో బుమ్రాకు ఇటీవల న్యూజిలాండ్‌లో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. దీంతో మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌-16 (IPL 16) సీజన్‌కు అతడు పూర్తిగా దూరమయ్యాడు. అయితే, చాలాకాలంగా బయటకు రాని అతడు.. డబ్ల్యూపీఎల్‌ (WPL) ఫైనల్‌ మ్యాచ్‌ని వీక్షించేందుకు ముంబయికి వచ్చాడు.

డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడిన ముంబయి ఇండియన్స్‌ను ఉత్సాహపరిచేందుకు అతడు మ్యాచ్‌కు హాజరయ్యాడు. బుమ్రా లేని లోటును భర్తీ చేయనున్న స్టార్‌ పేసర్‌ జోఫ్రా అర్చర్‌ (Jofra Archer)తో కొద్దిసేపు ముచ్చటించాడు. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న వీడియోని ముంబయి ఇండియన్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుంది. ఈ వీడియోని చూసిన అభిమానులు బుమ్రా కూడా ఈ సీజన్‌లో ఆడాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు. రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లతోపాటు ముంబయి ఇండియన్స్‌కు చెందిన దాదాపు అందరూ ఆటగాళ్లు డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను స్టేడియానికి వచ్చి వీక్షించారు. ముంబయి మెంటార్‌ సచిన్‌ తెందూల్కర్‌ కూడా సందడి చేశాడు. కాసేపు కీరన్‌ పొలార్డ్‌తో ప్రత్యేకంగా ముచ్చటించాడు. WPL ఫైనల్‌లో దిల్లీపై ముంబయి ఇండియన్స్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్‌ని ఎగరేసుకుపోయింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని