WTC Final: ఒక్క మ్యాచ్‌తో తక్కువ చేయొద్దు! 

ఫైనల్ మ్యాచ్‌ ఒక్కటే ఉండటం ఎంతో ఉత్సాహం కలిగిస్తుందని, కానీ.. భారత జట్టు ఎంత బలమైనదో చెప్పడానికి ఆ ఒక్క మ్యాచ్‌ సరిపోదని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 29 Jun 2021 01:41 IST

ఈ టీమ్‌ఇండియా చాలా బలమైంది: విలియమ్సన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫైనల్ మ్యాచ్‌ ఒక్కటే ఉండటం ఎంతో ఉత్సాహం కలిగిస్తుందని, కానీ.. భారత జట్టు ఎంత బలమైనదో చెప్పడానికి ఆ ఒక్క మ్యాచ్‌ సరిపోదని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అభిప్రాయపడ్డాడు. భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య గతవారం జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన విలియమ్సన్‌ టీమ్‌ఇండియాను పొగడ్తలతో ముంచెత్తాడు.

‘ఈ టీమ్ఇండియా చాలా బలమైన జట్టు. ఎదురులేనిది కూడా. అలాంటి జట్టుపై విజయం సాధించడం మాకు గర్వంగా ఉన్నా. వాళ్ల శక్తి, సామర్థ్యాలు ఏ పాటివో అందరికీ తెలిసిందే. వాళ్లింకా ఇలాంటివి ఎన్నో విజయాలు సాధిస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. వాళ్లెంత మంచి ఆటగాళ్లో తెలుసు. వాళ్లకున్న పేస్‌ బౌలింగ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమైంది. అలాగే స్పిన్‌ బౌలర్లు కూడా అత్యద్భుతంగా బంతులేస్తారు. ఇక బ్యాటింగ్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. బ్యాకప్‌ ఆటగాళ్లను కూడా అద్భుతంగా తయారు చేసుకున్నారు. మరోవైపు ఆటగాళ్లు కూడా క్రికెట్‌కు తమని తాము బ్రాండ్‌ అంబాసిడర్లుగా అనుకుంటారు’ అని విలియమ్సన్‌ పేర్కొన్నాడు.

ఇక మ్యాచ్‌ గురించి మాట్లాడుతూ చివరి రోజు ఫలితం అటు ఇటుగా మూడు విధాలుగా ఉందని, సమయాభావ పరిస్థితుల నేపథ్యంలో డ్రాగా ముగుస్తుందని అంతా అనుకున్నారని కివీస్‌ సారథి చెప్పాడు. ఆరో రోజు(రిజర్వ్‌డే) ఫలితం ఎలా అయినా ఉండొచ్చని తాము ముందే ఊహించామన్నాడు. అయితే, శక్తిమేరకు పోరాడాలని నిర్ణయించుకున్నట్లు విలియమ్సన్‌ వివరించాడు. కాగా, ఈ మ్యాచ్‌ ద్వారా పరిస్థితులు ఎలా మారుతాయో తెలిసొచ్చిందని అన్నాడు. మరోవైపు కోహ్లీ, పుజారాను త్వరగా ఔట్‌ చేయడం వల్లే తమకు కలిసి వచ్చిందని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని