IND vs SA : కోహ్లీ, ద్రవిడ్‌.. రాహుల్‌కు సహాయం చేయాల్సింది: కనేరియా

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఓటమిపాలవ్వడంపై పాక్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా స్పందించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ వెన్నునొప్పి...

Updated : 08 Jan 2022 15:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఓటమిపాలవ్వడంపై పాక్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా స్పందించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ వెన్నునొప్పి కారణంగా ఆటకు దూరమవ్వడంతో కేఎల్‌ రాహుల్‌ జట్టు పగ్గాలు అందుకొని ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఇది కెప్టెన్‌గా అతడికి తొలి టెస్టు మాత్రమే కావడంతో ఓటమి గురించి నిందించాల్సిన అవసరం లేదన్నాడు. అయితే, డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి కోహ్లీ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పలు సూచనలు చేయాల్సి ఉండేదని కనేరియా అభిప్రాయపడ్డాడు.

‘ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా వెనుకబడింది. అయితే, వాళ్లు దక్షిణాఫ్రికా జట్టు పరుగులు చేయడానికి మరింత కష్టపడేలా చేయాల్సింది. అది జరగకపోవడంతో సఫారీలు తేలిగ్గా పరుగులు సాధించారు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బౌలింగ్‌లో మార్పులు ఏమాత్రం బాగోలేవు. అయితే, ఇందులో రాహుల్‌ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడు ఇప్పుడే తొలిసారి టెస్టుల్లో కెప్టెన్సీ చేపట్టాడు. కోహ్లీ, ద్రవిడ్‌ లాంటి వారు డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి బౌలింగ్‌ విభాగానికి సంబంధించిన పలు సూచనలు పంపించాల్సి ఉండేది. అశ్విన్‌కు కూడా సరైన సమయంలో బౌలింగ్‌ ఇవ్వలేదు. దక్షిణాఫ్రికా విజయానికి 11 పరుగుల దూరంలో ఇచ్చారు. మరోవైపు బుమ్రా, షమి ధారాళంగా పరుగులిచ్చారు’ అని కనేరియా యూట్యూబ్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా, ప్రస్తుతం ఈ సిరీస్‌ 1-1తో సమానమవ్వగా ఈనెల 11 నుంచి మూడో టెస్టు జరగనుంది. ఇక్కడ విజయం సాధించి తొలిసారి దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవాలని కోహ్లీసేన తహతహలాడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని