
IND vs NZ: బాబ్బాబూ.. నేను తిన్నది స్వీట్ సుపారీ నాయనా..
రాత్రికిరాత్రే సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిన యువకుడు
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ఒకే ఒక్క స్టిల్తో రాత్రికిరాత్రే సెలబ్రెటీలు అవుతున్న వారూ ఉన్నారు. మీమర్స్ అయితే వెంటనే తమ టాలెంట్కు పదునుపెట్టేస్తారు. కొత్త ఐడియాలతో ఆ ఫొటోకు వ్యాఖ్యలు జోడించి మరీ ఊదరగొట్టేస్తారు. అయితే ఒక్కోసారి ఆ ఇమేజ్తో లేనిపోని కష్టాలను కొనితెచ్చుకోవాల్సిన పరిస్థితులూ వస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి అనుభవమే కాన్పూర్ వాసికి ఎదురైంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చిన ఓ వ్యక్తి నోటితో ఏదో నములుతూ స్టైల్గా ఫోన్లో మాట్లాడటం టీవీ స్క్రీన్ల మీద దర్శనమిచ్చింది. ఇక అంతే పాపం క్రికెట్ చూడటానికి వచ్చిన ఆ యువకుడిని నెటిజన్లు ఫుట్బాల్ ఆడుకున్నట్లు ఆడేసుకున్నారు. అతడు గుట్కా నములుతూ అలా ఫోన్లో మాట్లాడుతున్నాడని విమర్శలు గుప్పించారు. మరోవైపు మీమర్స్ అయితే చెలరేగిపోయారు. దీంతో ఒక్కసారిగా కుర్రాడు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారిపోయాడు.
ఎట్టకేలకు ఈ ఘటనపై యువకుడు స్పందించాడు. ‘‘అయ్యబాబోయ్ నేను గుట్కా నమలలేదు బాబూ.. ఏదో స్వీట్ సుపారీ పలుకులు మాత్రమే తిన్నా’’ అంటూ వివరణ ఇచ్చుకున్నాడు. ఇంతకీ ఇతగాడి పేరు షోబిత్ పాండే అంట. ఆ రోజు తన సోదరి ఇచ్చిన స్వీట్ సుపారీని మాత్రమే తిన్నానని చెప్పుకొచ్చాడు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి..
► Read latest Sports News and Telugu News