IND vs PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. అప్పుడు వస్తుంది అసలైన ఒత్తిడి : కపిల్‌ దేవ్‌

ఇండియా-పాకిస్థాన్‌(IND vs PAK) మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఆటగాళ్లపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. అభిమానుల అంచనాలు భారీగా ఉండే ఈ మ్యాచ్‌లపై మాజీ దిగ్గజం కపిల్‌ దేవ్‌(Kapil Dev) స్పందించాడు.

Updated : 31 Jul 2023 16:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : చిరకాల ప్రత్యర్థులైన భారత్‌-పాకిస్థాన్‌(IND vs PAK) మధ్య మ్యాచ్‌ అంటే.. ఇరు దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారన్న విషయం తెలిసిందే. త్వరలో జరిగే ఆసియా కప్‌.. ఆ తర్వాత జరిగే వన్డే ప్రపంచకప్‌ వేదికగా దాయాదుల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే ఈ మ్యాచ్‌లపై పలువురు విశ్లేషణలు ప్రారంభించారు. ఇరు జట్లకు ఎంతో  ప్రతిష్ఠాత్మకంగా మారే ఈ మ్యాచ్‌లపై మాజీ దిగ్గజం కపిల్‌దేవ్‌(Kapil Dev) కూడా స్పందించాడు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే.. అసలు ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తుందో తెలిపాడు.

భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ వెంటే అనేక పరిణామాలు చోటుచేసుకుంటాయి.. ఇవన్నీ ఒత్తిడికి దారితీస్తాయా? అని ఓ ఇంటర్వూలో కపిల్‌కు ప్రశ్న ఎదురైంది. దీనిపై ఈ దిగ్గజం స్పందిస్తూ.. ఆన్‌ఫీల్డ్‌ నుంచి ఒత్తిడి ఎదురుకాదని చెప్పాడు.

మీకు టీమ్‌ ఇండియా కంటే ఐపీఎల్‌ ముఖ్యమా..?

‘‘ఒత్తిడి అంటే ఏంటి? ఓ బంతిని ఎదుర్కొన్నప్పుడు మీరు ఒత్తిడికి గురికారు. కానీ.. మీరు కాఫీ ఆర్డర్‌ చేసినప్పుడు.. మీకు కాఫీ అందిస్తూ వెయిటర్‌ ‘పాకిస్థాన్‌పై అస్సలు ఓడిపోకూడదు’ అంటుంటే.. అప్పుడు వస్తుంది అసలైన ఒత్తిడి. ఆ తర్వాత అది పెరగడం ప్రారంభమవుతుంది’’ అని కపిల్‌ (Kapil Dev) వివరించాడు.

ఇక తన తరానికి చెందిన ఏ పాకిస్థాన్‌ క్రికెటర్‌తోనైనా స్నేహాన్ని కొనసాగిస్తున్నారా? అని ప్రశ్నించినప్పుడు.. ఈ రోజుల్లో ఎవరికీ సమయం లేదని చెప్పాడు. ‘నేను నా జట్టు సభ్యులను కలవను. ఎందుకంటే నా సొంత పనుల్లో నేను బిజీగా ఉంటాను కాబట్టి. అలాగే.. పాక్‌కు ప్రధానిగా పనిచేసిన ఇమ్రాన్‌ను నేను ఎలా కలవగలను’ అని కపిల్‌ ప్రశ్నించాడు.

ఇక ఈ 1983 ప్రపంచకప్‌ హీరో.. ప్రస్తుత టీమ్‌ఇండియా(Team India) సీనియర్‌ ఆటగాళ్ల తీరుపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని