నీటిపైనే ప్రాణం పోయింది 

టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారిగా సర్ఫింగ్‌ క్రీడను ప్రవేశపెట్టబోతున్నారని ఆ క్రీడాకారిణి సంతోషంలో మునిగిపోయింది. ఎలాగైనా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని పట్టుదలతో...

Updated : 23 Mar 2021 10:02 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారిగా సర్ఫింగ్‌ క్రీడను ప్రవేశపెట్టబోతున్నారని ఆ క్రీడాకారిణి సంతోషంలో మునిగిపోయింది. ఎలాగైనా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని పట్టుదలతో సాధన మొదలెట్టింది. నీటి అలలపై రయ్‌మని దూసుకెళ్లడంలో ఆరితేరేందుకు తీవ్రంగా శ్రమించింది. కానీ నీళ్లే ప్రాణంగా బతికిన ఆ అమ్మాయి.. చివరికి నీటిలోనే ప్రాణాలు వదిలింది. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల తీరకుండానే దురదృష్టవశాత్తూ పిడుగుపాటుకు గురై కన్నుమూసింది. ఆమే.. సాల్వడోర్‌కు చెందిన 22 ఏళ్ల కేథరిన్‌ డియాజ్‌. ఆ దేశంలోని అగ్రశ్రేణి సర్ఫర్‌ అయిన తను ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ కోసం సిద్ధమవుతోంది. ఆ ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీ అయిన ప్రపంచ సర్ఫ్‌ క్రీడల కోసం సాధన చేసేందుకు సముద్రంలోకి వెళ్లిన తను.. అక్కడే పిడుగుపాటుకు గురై కిందపడిపోయింది. వెంటనే అత్యవసర సహాయక సిబ్బంది ఆమెను ఒడ్డుకు చేర్చినప్పటికీ టుంకో బీచ్‌లోనే తుదిశ్వాస విడిచింది. ‘‘మా దేశానికి ప్రాతినిథ్యం వహించిన గొప్ప అథ్లెట్‌ మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె గొప్ప యోధురాలు. దేశం బాధతో కన్నీళ్లు పెడుతోంది’’ అని ఆ దేశ సర్ఫ్‌ సమాఖ్య సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని